ఒకప్పుడు చేసిన పరిశోధనలు ప్రపంచానికి తెలిసేందుకు కొన్ని జర్నల్స్లో మాత్రమే ప్రచురించేవారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వెబినార్ల ద్వారా పరిశోధనలపై సెమినార్లు ఇచ్చే అవకాశం దొరికింది. ఈమెయిల్స్లో ఆ పేపర్ను పంపే వెసులుబాటు వచ్చింది. అదింకా అభివృద్ధి చెంది ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా సైట్ల ద్వారా జనానికీ చేరువయ్యే వేదిక దొరికింది. చాలా మంది సైంటిస్టులు వాళ్లు చేసిన పరిశోధనలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజెప్తున్నారు. అలాంటి సైంటిస్టులకు ప్రోత్సాహం అందించే దిశగా రీసెర్చ్గేట్, అకాడమియా.ఈడీయూ (academia.edu) వంటి సంస్థలు లింక్డ్ ఇన్ వంటి సోషల్ మీడియా సైట్లతో జట్టు కడుతున్నాయి. ఆసప్సైన్స్ వంటి కొన్ని ప్రముఖ బ్లాగులు, వ్లాగులు జనానికి ఆ పరిశోధనలను చేరువ చేస్తున్నాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్, విస్ ఇనిస్టిట్యూట్ వంటి అంతర్జాతీయ సంస్థలు, కొన్ని పరిశోధనా సంస్థలు సొంతంగా సోషల్మీడియా పేజీలనే నడుపుతున్నాయి. మైక్రోస్కోపులో మాత్రమే కనిపించే అందమైన సూక్ష్మజీవులు, ఇతర బ్యాక్టీరియా బయోఫిల్స్మ్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. దాని వల్ల అవి జనానికి దగ్గరవుతున్నాయి.
ఇండియాలో పెరుగుతోంది
కొన్నేళ్లుగా మన దేశంలోనూ సైన్స్పై సోషల్మీడియా మంచి ఫలితాన్నే చూపిస్తోంది. సోషల్ మీడియా వల్ల తమ పరిశోధనలకు భాగస్వాములు దొరుకుతున్నారని, ఆర్థికంగా చేయూత లభిస్తోందని చాలా మంది సైంటిస్టులు చెబుతున్నారు. అంతేగాకుండా కొన్ని కంపెనీలు తమ పరిశోధనల తాలూకు పేపర్లను చూసి మంచి అవకాశాలు కూడా ఇస్తున్నాయంటున్నవాళ్లూ ఉన్నారు. సోషల్ మీడియానే ఆయా పరిశోధనలకు చర్చావేదికగా నిలుస్తోంది. ఉదాహరణకు ట్విట్టర్నే తీసుకుందాం. ఒక్క హాష్ట్యాగ్ అందరికీ చేరి ఎంతలా సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. ఆందోళనల దగ్గర్నుంచి మంచి పనుల వరకు ఆ హాష్ట్యాగ్ వెంటనే జనానికి చేరువవుతుంది. ఆ కోవలోనే రీసెర్చ్ ఫెలోషిప్ పెంచాలంటూ #hikeresearchfellowship హాష్ట్యాగ్తో చేసిన ట్విట్టర్ ఉద్యమం రీసెర్చ్ ఫెలోస్కు మంచి చేసింది.
జనం–సైన్స్కు వారధి
సైన్స్పై జనాల్లో అవగాహన కల్పించేందుకు వాట్సాప్ వంటి సైట్లు ఉపయోగపడుతున్నాయి. ఇటీవల సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సైంటిస్టులు బ్యాక్టీరియాలోని కణ త్వచ పెరుగుదలను నియంత్రించే ఓ ఎంజైమ్ను కనుగొన్నారు. దాని వల్ల ఓ కొత్త మందు కనుగొనేందుకు మార్గం ఏర్పడింది. దాని గురించి పత్రికల్లో వార్తలొచ్చినా సోషల్ మీడియా ద్వారానూ ఆ పరిశోధనను జనానికి చేరువ చేశారు సైంటిస్టులు. అంటే ఒరిజినల్ పరిశోధన జనానికి చేరుతుందన్నమాట. ఇండియా సైన్స్పై ప్రత్యేకంగా పనిచేస్తున్న ద లైఫ్ ఆఫ్ సైన్స్ (టీఎల్ఓఎస్) అనే సంస్థ, శాస్త్రపరిశోధనల్లో మహిళల పాత్రను జనానికి చేరువయ్యేలా చేస్తోంది.
‘సోషల్’ సైంటిస్ట్
అందరిలాగే ప్రముఖ సైంటిస్టులూ ట్విట్టర్, ఫేస్బుక్ వంటి వాటిలో చురుగ్గా ఉంటున్నారు. ఉదాహరణకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ కార్యదర్శి, భారత వైద్య పరిశోధనా మండలి, బిరాక్ వంటి సంస్థలు ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటున్నాయి. కాబట్టి నేటి తరం సైంటిస్టులకు తమ పరిశోధనలను నేరుగా అలాంటి పెద్ద ఆఫీసర్లకు తెలియజేయడం సులువు అవుతోంది. ఆ పరిశోధనలను వాళ్లకు ట్యాగ్ చేయడం ద్వారా ఈజీగా వారి దగ్గరకు చేరిపోతోంది. ఇంత చేస్తున్నా ఇప్పటికీ 80 శాతం పరిశోధనలు జనానికి చేరువ కావట్లేదు. ఆ గ్యాప్ను పూడ్చాలంటే దాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవాలంటున్నారు. పరిశోధనలు జనానికి మరింత చేరువయ్యేలా స్థానిక భాషల్లో సైన్స్ బ్లాగులు ప్రచురించాల్సిన అవసరం ఉందంటున్నారు. జనానికి మరింత దగ్గర చేయాల్సి ఉందని చెబుతున్నారు.
సూడో సైన్స్పై పోరు
ఈ మధ్య సూడోసైన్స్ కథనాలు ఎక్కువైపోయాయి. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (టెస్ట్ ట్యూబ్ బేబీ)నే తీసుకుందాం. కొద్ది నెలల క్రితం నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఓ ప్రముఖ సైంటిస్టు, అది మహాభారతం కాలంలోనే ఉందని, కౌరవులు ఆ పద్ధతిలోనే పుట్టారన్న వ్యాఖ్యలు చేశారు. దానిపై పెద్ద దుమారమే చెలరేగింది. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ దానిపై పెద్ద వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కారణం, సోషల్మీడియాలో దానిపై ఓ ఉద్యమమే నడిచింది కాబట్టి. #savescience పేరిట సూడోసైన్స్పై పోరాటం చేశారు. అదొక్కటే కాదు, అలాంటి పోరాటాలు చాలానే జరుగుతున్నాయి.