
- దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టుకు ఈడీ విజ్ఞప్తి
- ఈ అంశాన్ని మే 20న పరిశీలిస్తామన్న జడ్జి కావేరి బవేజా
- అప్పటి వరకు కవిత కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో కల్వకుంట్ల కవితపై 8 వేల పేజీలతో సప్లమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేశామని రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఈడీ తెలిపింది. ఈ చార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకోవాలని ఈడీ అడ్వకేట్ మట్ట కోరారు. ఈడీ కేసులో కవితకు విధించిన జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియడంతో తీహార్ జైలు సిబ్బంది ఆమెను వర్చువల్గా ట్రయల్ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. ఈడీ తరఫున మట్ట వాదనలు వినిపించారు. ఆమె బయట ఉంటే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేసే చాన్స్ ఉందని
అందువల్ల మరో 14 రోజుల కస్టడీ పొడిగించాలని రెండు పేజీల అప్లికేషన్ను కోర్టుకు సమర్పించారు. అయితే, ఆధారాలు లేని కేసులో కవితను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని ఆమె తరఫున అడ్వకేట్ నితేశ్ రాణా, మోహిత్ రావు వాదించారు. అయితే.. ఇరువైపుల వాదనలు విన్న బెంచ్ కవితకు మరో 6 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగిండించింది. తిరిగి మే 20న తమ ముందు హాజరుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సీబీఐ కేసులోనూ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది.
చార్జ్ షీట్ సరిగా ఉందో..? లేదో..? చూస్తం : కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై దాఖలు చేసిన చార్జ్ షీట్ను ఈ నెల 20న పరిశీలిస్తామని ట్రయల్ కోర్టు తెలిపింది. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు విచారణ తర్వాత.. కవితపై దాఖలు చేసిన చార్జ్షీట్ అంశాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మట్ట స్పెషల్ జడ్జి దృష్టికి తెచ్చారు. గడువులోపు ఈ చార్జ్షీట్ దాఖలు చేశామని, దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అయితే, జడ్జి కావేరి బవేజా స్పందిస్తూ.. ముందు ఈడీ దాఖలు చేసిన చార్జ్షీట్ సరైన పద్ధతిలో ఉందో? లేదో పరిశీలించి, ఆ తర్వాత స్పందిస్తామన్నారు.
చార్జ్షీట్పై తదుపరి విచారణ ఈ నెల 20న చేపడతామని స్పష్టం చేశారు. ఈ నెల 10న ఈడీ దాఖలు చేసిన 200 పేజీల ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (చార్జిషీట్)లో కవితతో పాటు ఆప్ గోవా ప్రచారాన్ని నిర్వహించిన దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ చానెల్ మాజీ ఉద్యోగి అర్వింద్ సింగ్ను తాజా చార్జ్షీటులో నిందితులుగా పేర్కొంది.