
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు టీచర్లను సంతృప్తి పర్చలేదని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అభిప్రాయపడ్డారు. రెండో డీఏ ఆరు నెలల తర్వాత ఇస్తామనడం సరికాదని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పెండింగ్ బిల్స్ చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని.. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం మరో డీఏ మంజూరు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ క్రమంలో రెండో డీఏను ఆరు నెలల తర్వాత కాకుండా ఆగస్టు నెలలోనే చెల్లించాలని కోరారు. మిగిలిన డీఏలనూ డిసెంబర్ లోపే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైమరీ స్కూళ్లలో తరగతికి ఒక టీచర్ ఉండేలా రూల్స్ మార్చాలని కోరారు. జీవో 317 మిగిలిన బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.