
ఆషాఢమాసంలో తెలంగాణ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది బోనాల జాతర. ఇప్పటికే హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాల సంబురం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. బోనాలు మరుసటి రోజు జరిగే రంగం కోసం కూడా జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నుంచి ప్రభుత్వం బోనాలను ఘనంగా నిర్వహిస్తోంది.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి బోనాల జాతర జూలై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనున్నాయి. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండగా.. భక్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు.
ఉజ్జయినీ మహాంకాళి ఆలయం పరిసర ప్రాంతాల చుట్టూ 2 కి.మీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. పండుగ సమయంలో ( జులై 13 నుంచి 15 వరకు) ఈ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ – రోడ్డు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ప్యాట్నీ.. -ప్యారడైజ్... -బేగంపేట మార్గాలను.. నివారించాలని సూచించారు. అదేవిధంగా, భక్తుల భద్రత కోసం 2,500 మంది పోలీసు సిబ్బంది, 50 సీసీ కెమెరాలు మోహరించనున్నట్లు పోలీసులు తెలిపారు.
రైల్వే ప్రయాణికులకు ముఖ్య సూచనలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులుచిలకల గూడ వైపు నుండి ప్లాట్ఫారమ్ నంబర్ 10 గేటు ద్వారా లోపలికి ప్రవేశించాలని పోలీసులు కోరుతున్నారు. దీనివల్ల అనవసరమైన గందరగోళం తప్పించి, సమయానికి స్టేషన్ చేరుకోవచ్చని సూచించారు. భక్తులు, ప్రయాణికులు ఈ సూచనలను గౌరవించి సహకరించాలనీ, వేడుకలను భద్రతగా జరుపుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
టొబాకో బజార్, హిల్ స్ట్రీట్ నుండి మహంకాళి ఆలయం, బాటా ఎక్స్ రోడ్ల నుండి రోచా బజార్ వరకు సుభాష్ రోడ్డు,ఔదయ్య ఎక్స్ రోడ్ నుండి మహంకాళి ఆలయం, జనరల్ బజార్ నుండి మహంకాళి ఆలయం రోడ్లను జూలై 13న తెల్లవారుజామున 12 గంటల నుండి జూలై 15న తెల్లవారుజామున 3 గంటల వరకు మూసివేయనున్నారు.
శివసత్తులు, జోగినీలు జూలై 13 ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బాటా జంక్షన్ నుంచి మొత్తం 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనం సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొనే భక్తులు ఇబ్బంది రెండు క్యూలైన్లు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ క్యూలైన్ లో బోనంతో వచ్చే మహిళతో పాటూ మరో ఐదుగురిని అనుమతిస్తారు. దివ్యాంగులు -... సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక క్యూలైన్లను నిర్వాహకులు.. పోలీసులు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలతో పాటు ఫలహార బండ్ల ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుందన్నారు.
సికింద్రాబాద్ లష్కర్ బోనాల సందర్భంగా జూలై 13 ఆదివారం ఉదయం 6 గంటల నుంచి జూలై 15 మంగళవారం ఉధయం 6 గంటలవరకూ మందు దుకాణాలు మూతపడనున్నాయి. బార్లు, వైన్ షాపులు, కల్లుదుకాణాలు మూసివేయాలని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వాహనాల డైవర్షన్ ఇలా..
కర్బలా మైదాన్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చే వాహనాలు:
- మినిస్టర్స్ రోడ్ – రసూల్పురా ఎక్స్ రోడ్ – P&T ఫ్లై ఓవర్ – HPS – CTO – SBI ఎక్స్ రోడ్ – YMCA ఎక్స్ రోడ్ – St. John’s రోటరీ – సంగీత్ జంక్షన్ – గోపాల్పురం లేన్ – రైల్వే స్టేషన్కి వెళ్లాలి.
బైబిల్ హౌస్ నుండి రైల్వే స్టేషన్ వైపు రోడ్డు:
- సజ్జనలాల్ వీధి లేదా హిల్ స్ట్రీట్, రాణిగంజ్ మార్గం ఉపయోగించాలి.
SBI ఎక్స్ రోడ్, ప్యారడైజ్ నుండి టాంక్ బండ్ వైపు:
- ప్యారడైజ్ – మినిస్టర్స్ రోడ్ లేదా క్లాక్ టవర్ – సంగీత్ ఎక్స్ రోడ్ – సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ – చిల్కలగూడ – ముషీరాబాద్ ఎక్స్ రోడ్ – కవాడిగూడ – మారియట్ హోటల్ – టాంక్ బండ్ మార్గాలను ఉపయోగించాలి.
ప్యారడైజ్ నుండి బైబిల్ హౌస్ వైపు:
- ప్యాట్నీ ఎక్స్ రోడ్ దగ్గర నుండి SBI లేదా క్లాక్ టవర్ వైపు మళ్లించబడుతుంది.
క్లాక్ టవర్ నుండి RP రోడ్ వైపు:
- SBI ఎక్స్ రోడ్ లేదా ప్యారడైజ్, మినిస్టర్స్ రోడ్, రసూల్పురా, రాణిగంజ్, టాంక్ బండ్ మార్గాలను అనుసరించాలి.
అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్లైన్ 9010203626కి కాల్ చేసి సాయం పొందవచ్చని పోలీసు అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ జాం ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఇవే..!
- కర్బలా మైదాన్ – రాణిగంజ్ – రామ్గోపాల్పేట్ పాత పోలీస్ స్టేషన్ – ప్యారడైజ్ – CTO – ప్లాజా – SBI ఎక్స్ రోడ్ – YMCA ఎక్స్ రోడ్ – St. John’s రోటరీ – సంగీత్ ఎక్స్ రోడ్ – ప్యాట్నీ ఎక్స్ రోడ్ – పార్క్ లేన్ – బాటా – ఘాస్మండి ఎక్స్ రోడ్ – బైబిల్ హౌస్ – మినిస్టర్స్ రోడ్ – రసూల్పురా.. ఈ ప్రాంతాల్లో పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.