యంగ్ జనరేషన్ కి ఫ్యాషన్ పాఠాలు చెప్తుంటుంది సెజల్. అంతేకాదు.. విమెన్ ఇష్యూష్ మీద వీడియోలు చేసి, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటుంది. యూనిసెఫ్తో కలిసి చైల్డ్ ప్రొటెక్షన్ క్యాంపెయిన్ చేసింది. ఆమె చేసే ఫ్యాషన్ వ్లాగ్స్తో పాటు డైలీ వ్లాగ్స్ ని చాలా మంది చూస్తుంటారు.
సెజల్ కుమార్ ఇండియాలో ఫేమస్ యూట్యూబర్. యాక్టర్, ఫ్యాషన్ బ్లాగర్, మోడల్ కూడా. 1995 జనవరి 1న పుట్టిన సెజల్ 2014 ఫిబ్రవరిలో యూట్యూబ్ ఛానెల్ని మొదలుపెట్టింది. అప్పటికి ఆమెకు19 ఏండ్లు. ఆ తర్వాత ‘ఇంజనీరింగ్ గర్ల్స్’ అనే వెబ్ సిరీస్తో యాక్టర్గా గుర్తింపు తెచ్చుకుంది. పుట్టి, పెరిగింది న్యూఢిల్లీలో అయినా.. ఇప్పుడు ముంబైలో ఉంటోంది. ఢిల్లీలోని మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంది. తర్వాత న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
యాక్టింగ్ అంటే ఇష్టం
నాన్న అనిల్ కుమార్.. రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మేజర్. అమ్మ అంజలి కుమార్ గుర్గావ్లోని ఆర్టెమిస్ హాస్పిటల్లో గైనకాలజీ డాక్టర్. అదే డిపార్ట్మెంట్కు డైరెక్టర్గా కూడా పనిచేస్తోంది. సెజల్ చిన్నప్పటి నుంచే పెద్ద యాక్టర్ కావాలని కలలు కనేది. అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేసింది. చాలాసార్లు ఆడిషన్స్ కూడా ఇచ్చింది. కానీ.. సెలెక్ట్ కాలేదు. ఆమె మంచి బాస్కెట్బాల్ ప్లేయర్. స్కూల్ లో చదువుతున్నప్పుడు చాలా పోటీల్లో తన టాలెంట్ నిరూపించుకుంది. డిగ్రీ చదువుతున్నప్పుడు డాన్స్పై ఎక్కువ దృష్టి పెట్టింది. తర్వాత ‘డాన్స్ వర్క్స్’ సంస్థలో ప్రొఫెషనల్ డాన్సర్గా కెరీర్ మొదలుపెట్టి రెండేండ్ల తర్వాత మానేసింది.
నెమ్మది.. నెమ్మదిగా..
‘సెజల్ కుమార్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టిన తర్వాత మొదటగా ‘సమ్మర్ స్టైల్ టర్కీ’ పేరుతో మొదటి వీడియో అప్లోడ్ చేసింది. ఆ వీడియో తన ఇంటర్న్షిప్ ట్రిప్ కోసం టర్కీ వెళ్లినప్పుడు చేసింది. మొదటి వీడియోకు అంత రీచ్ రాలేదు. అయినా నిరాశపడకుండా వీడియోలు చేసింది. ఛానెల్కు మెల్లమెల్లగా సబ్స్క్రయిబర్స్ పెరిగారు. ఇప్పటివరకు దాదాపు 500 వీడియోల వరకు అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఆమె ఛానెల్కు1.38 మిలియన్ల సబ్స్క్రయిబర్స్ ఉన్నారు. ఈ మధ్య షార్ట్స్ ఎక్కువగా తీసి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం ఫ్యాషన్, వ్లాగ్స్, సింగింగ్, డాన్స్ లాంటి అంశాలపై వీడియోలు చేస్తోంది. కొన్ని రోజుల నుంచి పాడ్కాస్ట్స్ కూడా చేస్తోంది. 2018లో వచ్చిన ‘ఇంజనీరింగ్ గర్ల్స్’లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ‘అజబ్ బిలాల్కి గజబ్ కహానీ’ అనే షార్ట్ఫిల్మ్లో కూడా చేసింది.
ఆడవాళ్ల ఆరోగ్యం గురించి..
సెజల్ వాళ్ల అమ్మ అంజలి కుమార్ తో కలిసి ‘మైత్రి’ పేరుతో ఒక ఫౌండేషన్ మొదలుపెట్టింది. అదే పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి విమెన్ హెల్త్ ఇష్యూష్ మీద వీడియోలు చేస్తున్నారు. గైనకాలజిస్ట్గా 30 ఏండ్ల అనుభవం ఉన్న వాళ్ల అమ్మ ఈ ఛానెల్ ద్వారా ఫిమేల్ హెల్త్పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.
అవార్డులు
యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత సెజల్ ఎన్నో అవార్డ్స్ దక్కించుకుంది. 2018లో ‘కాస్మోపాలిటన్ ఇండియా బ్లాగర్’ అవార్డ్ దక్కించుకుంది. 2019లో ‘ఎగ్జిబిట్ మ్యాగజైన్ అవార్డ్ ఆఫ్ టాప్ 5000 ఇన్ఫ్లూయెన్సర్స్’ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ‘ఉమెన్ ఆఫ్ స్టీల్ సమ్మిట్’, ‘బెస్ట్ యూత్ ఇన్ఫ్లూయెన్సర్’ అవార్డులు కూడా అందుకుంది. సెజల్ అవార్డులతోపాటు డబ్బు కూడా బాగానే సంపాదిస్తోంది. ఇప్పటివరకు యూట్యూబ్ ద్వారా దాదాపు నాలుగు కోట్ల రూపాయలు సంపాదించింది. ఆమె చేసిన వీడియోలకు ఇప్పటివరకు దాదాపు 250 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.