తెలంగాణ వాటా యూరియాను సకాలంలో పంపండి: నడ్డాకు CM రేవంత్ రిక్వెస్ట్

తెలంగాణ వాటా యూరియాను సకాలంలో పంపండి: నడ్డాకు CM రేవంత్ రిక్వెస్ట్

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం (జూలై 8) కేంద్ర మంత్రి నడ్డాను ఆయన నివాసంలో కలిశారు సీఎం రేవంత్. వానా కాలం సీజ‌న్‌కు సంబంధించి ఏప్రిల్ - జూన్ మ‌ధ్య రాష్ట్రానికి 5 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల‌కు గానూ కేవలం 3.07 ల‌క్షల మెట్రిక్ ట‌న్నులు మాత్రమే స‌ర‌ఫ‌రా చేశార‌ని ఈ సందర్భంగా నడ్డా దృష్టికి తెచ్చారు సీఎం రేవంత్.

 రాష్ట్రంలో ప్రాజెక్టుల‌కు నీరు రావ‌డం, వ్యవసాయ ప‌నులు జోరుగా సాగుతున్న స‌మ‌యంలో యూరియా స‌ర‌ఫ‌రా కాక‌పోవ‌డంతో రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని కేంద్ర మంత్రికి వివ‌రించారు. జులై నెలకు సంబంధించి దేశీయంగా ఉత్పత్తయిన యూరియా 63 వేల మెట్రిక్ ట‌న్నులు, విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న యూరియా 97 వేల మెట్రిక్ ట‌న్నులు రాష్ట్రానికి స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉండ‌గా, ఇప్పటివ‌ర‌కు కేవ‌లం 29 వేల మెట్రిక్ ట‌న్నుల యూరియా మాత్రమే చేశార‌ని వివరిస్తూ వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే, తెలంగాణకు దేశీయంగా ఉత్పత్తి అవుతున్న యూరియా కోటాను పెంచాల‌ని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. యూరియా స‌ర‌ఫ‌రాకు సంబంధించి రైల్వే శాఖ త‌గిన రేళ్లు కేటాయించ‌డం లేద‌ని, వాటి సంఖ్య కూడా పెంచాల‌ని కోరారు.

►ALSO READ | బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు నన్నడగొద్దు