హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్కు సంస్కారం లేదని, అలాంటి వాళ్ల గురించి ఎక్కువ మాట్లాడనని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ గురించి కేటీఆర్ సంస్కారహీనంగా మాట్లాడారని ఫైరయ్యారు. ఆదివారం ఆయన హైదరాబాద్లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని బీఆర్ఎస్ అమలు చేసిందో చెప్పాలని జానారెడ్డి ప్రశ్నించారు. దేశంలో రైతులకు ఉచిత కరెంట్ఇచ్చింది కాంగ్రెస్ అని, 1995 నాటికే ఐదు లక్షల గ్రామాలకు కరెంట్ సదుపాయం కల్పించింది కాంగ్రెస్ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసింది కాంగ్రెస్ లీడర్లేనన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనేనన్నారు. 2004లోనే రైతులకు ఉచిత కరెంట్ను అందించామని, కరెంట్ బిల్లులను రద్దు చేశామని గుర్తు చేశారు.
కాంగ్రెస్ అటవీ హక్కులు ఇయ్యకుంటే గిరిజనులకు పోడు భూములు వచ్చేవా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.ఐదున్నర లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై పూర్తిగా అధ్యయనం చేశాక మాట్లాడుతానని జానా రెడ్డి చెప్పారు. అంతకుముందు.. కొల్లాపూర్ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న జగదీశ్వర్ రావుతో జానా రెడ్డి భేటీ అయ్యారు. భేటీలో జూపల్లి కృష్ణారావు, మల్లు రవితదితరులు పాల్గొన్నారు.