కేటీఆర్​కు సంస్కారం లేదు.. అట్లాంటోళ్ల గురించి మాట్లాడను: జానా రెడ్డి

కేటీఆర్​కు  సంస్కారం లేదు.. అట్లాంటోళ్ల గురించి మాట్లాడను: జానా రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్​కు సంస్కారం లేదని, అలాంటి వాళ్ల గురించి ఎక్కువ మాట్లాడనని కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి అన్నారు. రాహుల్​ గాంధీ గురించి కేటీఆర్​ సంస్కారహీనంగా మాట్లాడారని ఫైరయ్యారు. ఆదివారం ఆయన హైదరాబాద్​లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. 

ఎన్నికల్లో ఇచ్చిన ఏ  హామీని  బీఆర్​ఎస్​ అమలు చేసిందో చెప్పాలని జానారెడ్డి ప్రశ్నించారు. దేశంలో రైతులకు ఉచిత కరెంట్​ఇచ్చింది కాంగ్రెస్ అని, 1995 నాటికే ఐదు లక్షల గ్రామాలకు కరెంట్​ సదుపాయం కల్పించింది కాంగ్రెస్ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసింది కాంగ్రెస్​ లీడర్లేనన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్​ పార్టీనేనన్నారు. 2004లోనే రైతులకు ఉచిత కరెంట్​ను అందించామని, కరెంట్​ బిల్లులను రద్దు చేశామని గుర్తు చేశారు. 

కాంగ్రెస్​ అటవీ హక్కులు ఇయ్యకుంటే గిరిజనులకు పోడు భూములు వచ్చేవా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.ఐదున్నర లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై పూర్తిగా అధ్యయనం చేశాక మాట్లాడుతానని జానా రెడ్డి చెప్పారు. అంతకుముందు.. కొల్లాపూర్​ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న జగదీశ్వర్​ రావుతో జానా రెడ్డి భేటీ అయ్యారు. భేటీలో జూపల్లి కృష్ణారావు, మల్లు రవితదితరులు పాల్గొన్నారు.