
- తల్లిని చంపిన టెన్త్ క్లాస్ కూతురు
- ప్రేమకు అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి హత్య.. గొంతు నులిమి.. సుత్తితో కొట్టి.. పీక కోసి మర్డర్
- కుర్చీ పైనుంచి పడి తల్లి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం
- అమ్మను అక్కే చంపిందన్న చెల్లె.. పోలీసులకు ఫోన్ చేయనివ్వలేదని కన్నీరుమున్నీరు
- మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో ఘటన
జీడిమెట్ల, వెలుగు: ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్నతల్లిని పదో తరగతి చదివే కూతురు.. ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. గొంతు నులిమి.. సుత్తితో తలపై కొట్టి.. గొంతు కోసి చంపేసింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో చోటు చేసుకున్నది. తొర్రూరు దగ్గరున్న ఇనుగుర్తికి చెందిన ఎస్.అంజలి.. కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్నగర్ ఎల్ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్నది. తెలంగాణ సాంస్కృతిక సారథిలో సభ్యురాలిగా ఉన్నది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు. 15 ఏండ్ల పెద్ద కూతురు.. టెన్త్ క్లాస్ చదువుతున్నది. 3 నెలల కింద నల్గొండ జిల్లా కట్టంగోర్కు చెందిన 19 ఏండ్ల పగిల్ల శివతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ గురించి తల్లి అంజలికి చెప్పింది. దీంతో ఆమె పలుమార్లు కూతురును మందలించింది. ముందు చదువు మీద దృష్టిపెట్టాలని, మేజర్ అయ్యాక పెండ్లి చేస్తానని నచ్చజెప్పింది. ఇవేమీ పట్టించుకోని కూతురు.. ఈ నెల 19వ తేదీన ఇంట్లో నుంచి పారిపోయింది. తల్లి అంజలి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆమె కూతురు నల్గొండలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. 20వ తేదీన తీసుకొచ్చి తల్లికి అప్పగించారు.
అప్పటి నుంచి తల్లి అంజలిపై కూతురు కోపం పెంచుకున్నది. తల్లి బతికి ఉన్నంత వరకు శివతో కలిసి ఉండలేనని డిసైడ్ అయింది. ఎలాగైనా తల్లిని చంపేయాలని ప్రియుడు శివకు చెప్పింది. సోమవారం రాత్రి శివ.. తన తమ్ముడు యశ్వంత్తో కలిసి అంజలి ఇంటికి వచ్చాడు. ప్లాన్లో భాగంగా పక్కింట్లో ఉన్న అమ్మ ఫ్రెండ్ను పిలుచుకురావాల్సిందిగా అంజలి పెద్ద కూతురు తన చెల్లెను పంపింది. అంజలి(39) పూజ చేస్తుండగా.. ఆమె పెద్ద కూతురు, శివ, యశ్వంత్ కలిసి చున్నీని ఆమె గొంతుకు బిగించి చంపేశారు.
తర్వాత సుత్తెతో నుదిటిపై కొట్టారు. ఇంకా కొన ఊపిరితో ఉండగా.. కత్తితో గొంతు కోసి చంపేశారు. తర్వాత ఏం తెలియనట్లు తల్లి పూజ చేస్తుండగా.. కిందపడిపోయిందని తన చెల్లిని అక్క నమ్మించే ప్రయత్నం చేసింది. తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య విషయం బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీసీపీ సురేశ్ కుమార్ పరిశీలించారు.
అమ్మను చంపేందుకే నన్ను బయటకు పంపింది: అంజలి చిన్నకూతురు
అమ్మను చంపేందుకే అక్క తనను బయటికి పంపిందని మృతురాలి చిన్న కూతురు తెలిపింది. ‘‘పక్కింట్లో ఉండే ఆంటీని అమ్మ పిలుచుకురమ్మందని అక్క చెప్పింది. నేను బయటికెళ్లి వచ్చేసరికి అమ్మ రక్తపు మడుగులోపడి కొట్టుకుంటున్నది. పోలీసులకు, అంబులెన్స్కు ఫోన్ చేద్దామంటే అక్క చేయనివ్వలేదు. ఎవరికైనా ఫోన్ చేస్తే మనకే ప్రమాదమని హెచ్చరించింది. అమ్మ చనిపోయేదాకా నన్ను ఇంటి బయటే కూర్చోబెట్టింది. ఎక్కడికీ పోనియ్యలేదు. సుత్తెతో కొట్టినా చనిపోకపోవడంతో కత్తితో గొంతు కోశారు’’ అని అంజలి చిన్న కూతురు తెలిపింది.
అమ్మ చనిపోవడంతో తాను, పెద్దమ్మ చాలా ఏడ్చామని, అక్క మాత్రం అస్సలు ఏడ్వలేదని వివరించింది. తన తల్లిని చంపినోళ్లను వదలొద్దని కోరింది. అలాగే.. వదిలేస్తే ఎంతో మందిని చంపుతారని చిన్నారి కన్నీరుమున్నీరుగా విలపించింది. అంజలి మృతిపై తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులు నివాళులర్పించారు. మందకృష్ణ మాదిగ, గద్దర్ కూతురు వెన్నెల హాజరయ్యారు. మృతురాలు అంజలి.. చాకలి ఐలమ్మ బంధువు అని గుర్తు చేసుకున్నారు.