దివ్యాంగుల కోసం సెన్సరీ పార్క్

దివ్యాంగుల కోసం సెన్సరీ పార్క్
  • దేశంలోనే మొదటి సెన్సరీ పార్క్
  • దివ్యాంగుల కోసం సెన్సరీ పార్క్ ఏర్పాటు చేసిన ఒడిశా ప్రభుత్వం

పార్కు​లో జారుడు బల్ల మీద నుంచి కిందకి జారుతూ.. సీ–సా మీద కూర్చొని ఆడుతూ... ఉయ్యాల ఊగుతూ ఎంతో సంబరపడిపోతారు పిల్లలు. కానీ చూపు, వినికిడి శక్తి లేని పిల్లలు,  దివ్యాంగులైనవాళ్లు మిగతా పిల్లల లెక్క పార్కు​లో ఆడుకోలేరు. అయితే... వీళ్లకోసం  స్పెషల్ పార్క్ ఒకటి ఉంది. ఈ పార్కు​లో మాత్రం వీళ్లు కూడా అందరు పిల్లల్లా చిరునవ్వులు చిందిస్తూ నచ్చినంత సేపు ఆడుకుంటున్నారు.అదెలా సాధ్యమైందంటే... అది సెన్సరీ​ పార్క్ కావడం వల్లే​. ఒడిశాలోని భువనేశ్వర్​లో ఉంది ఈ పార్క్.  
దివ్యాంగులైన పిల్లలు, మానసికంగా ఎదగని పిల్లలు చురుకుగా ఉండాలంటే ఆటలు ఆడడం తప్పనిసరి. కానీ, పార్క్​లో  దెబ్బ తగలకుండా, కిందపడకుండా ఆడుకోవడం వీళ్లకు కష్టమే. అందుకని వాళ్లకు అనువైన పార్క్​  ఏర్పాటుచేస్తే.. అందులో ఎంచక్కా ఆడుకుంటారు అనుకున్నారు అక్కడి  మున్సిపల్ అధికారులు. భువనేశ్వర్​లోని షాహిద్ నగర్​లో ఈ  సెన్సరీ​ పార్క్​ ఏర్పాటుచేశారు. ‘స్మార్ట్ సిటీ మిషన్​’లో భాగంగా ఈ పార్క్​ని డెవలప్ చేశారు. 
గోడల మీద బ్రెయిలీ లిపి
దివ్యాంగులు ఇందులో నడిచేటప్పుడు తూలి కిందపడకుండా ఉండేందుకు నేల మీద ఇథిలీన్ ప్రొపైలీన్ డైఈన్​ మోనోమర్ (ఇపిడిఎం)​ రబ్బర్​ మ్యాట్స్ వేశారు. ఈ పార్క్​లో చక్రాల కుర్చీ ఉయ్యాల, ఇద్దరు కూర్చొనే ఉయ్యాల, సంగీతం వినిపించే స్తంభాలు, బాస్కెట్ బాల్ కోర్ట్​తో పాటు జిమ్ కూడా ఉంది. అంతేకాదు గోడల మీద చెక్కిన బ్రెయిలీ లిపి అక్షరాల్ని తాకి, ఎక్కడ ఏ ఆటవస్తువు ఉంది? ఎటు వెళ్లాలి?  అనేవి తెలుసుకోవచ్చు. దివ్యాంగులైన పెద్దవాళ్లు కూడా  సేదతీరుతున్నారు. ఆటిజం, పార్కిన్​సన్స్ వంటి సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఈ సెన్సరీ పార్క్​లో ఆడుకుంటున్నారు. దివ్యాంగులకు సౌకర్యంగా ఉండేలా తాగేనీళ్లు, టాయిలెట్స్​ని ఏర్పాటుచేశారు. ఈ పార్క్ ఉదయం 5 గంటల నుంచి 11 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది.