బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో కలిసి మరికొన్ని రోజులు ఉండనున్నాడు. ఇందుకోసం సోమవారం నుంచి ఐర్లాండ్ లో ప్రారంభమైన బంగ్లాదేశ్ వరల్డ్కప్ ప్రిపరేషన్ క్యాంపునకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్యాంప్ తర్వాత బంగ్లా, ఐర్లాండ్, వెస్టిండీస్ మధ్యమే 5 నుంచి ట్రై సిరీస్ ప్రారంభమవుతుంది. వరల్డ్కప్ కు సన్నాహంగా భావిస్తున్న ఈ సిరీస్ లో షకీబ్ బరిలోకి దిగుతాడని, ప్రిపరేటివ్ క్యాంప్ కు దూరంగా ఉంటాడని బంగ్లాదేశ్ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ అక్రమ్ ఖాన్ కూడా చెప్పారు.
సన్ రైజర్స్ జట్టు నుంచి ఓ ఆటగాడు వెళ్లిపోతున్నాడని, తనకు తుది జట్టు లో అవకాశముందని, మరికొన్ని రోజులు ఇండియాలోనే ఉండేందుకు అవకాశమివ్వాలని షకీబ్ తమని కోరినట్లు అక్రమ్ తెలియజేశారు. ఈఐపీఎల్ సీజన్ లో షకీబల్ ఇప్పటివరకు ఒకేఒక్క మ్యాచ్ లో బరిలోకి దిగాడు. బెయిర్స్టో మంగళవారం రైజర్స్ కు గుడ్ బై చెప్పి స్వదేశానికి వెళుతుండగా, డేవిడ్ వార్నర్ కూడా మరికొద్ది రోజుల్లో ఆసీస్ బయలుదేరతాడు. ఈ నేపథ్యంలో షకీబ్ కు తుది జట్టులో చోటుదక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.