కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలన్ని మరో మూడేళ్లు పొడిగిస్తూ ప్రధాని మంత్రి నేతృత్వంలోని కేబినేట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో మరో మూడేళ్లు పాటు ఆయన ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించనున్నారు. మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో 2018లో శక్తికాంత దాస్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది డిసెంబర్ 10తో ఆయన పదవికాలం ముగియనుంది. ఈ క్రమంలోనే ప్రధాని నేతృత్వంలో సమావేశమైన కేబినేట్ మరో మూడేళ్ల పాటు ఆయన పదవికాలన్ని పొడిగించింది.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న తరుణంలో దేశంలో సంక్షోభం తలెత్తకుండా కీలక చర్యలు చేపట్టారు శక్తికాంత దాస్. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా అడ్డుకోగలిగారు. వడ్డీరేట్లను తగ్గిస్తూ ద్రవ్యపరపతి విధానంలో సర్దుబాటు వైఖరిని కొనసాగించారు. ప్రభుత్వ ఉద్దీపనలతో పాటు ఆర్బీఐ తరఫున ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. లాక్డౌన్ విధించిన సమయంలో లోన్ మారటోరియం మంచి ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థకు మరింత శక్తిని నింపేందుకు శక్తికాంత దాస్ వ్యూహాలు అవసరం అని బావించిన ప్రభుత్వం ఆయన్ను కొనసాగించేందుకే నిర్ణయం తీసుకుంది.