టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టున్నప్పటికీ స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్కు షమీ ఎంపిక కాలేదు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ షమీని పరిగణలోకి తీసుకోకుండా పక్కన పెట్టింది. దీంతో భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశతో ఉన్న షమీ మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. షమీతో పాటు దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించే సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్కి కూడా బీసీసీఐ మొండిచేయి చూపించింది. ఈ ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్లో ఘోరంగా విఫలం కావడంతో సౌతాఫ్రితా టెస్ట్ సిరీస్కు నాయర్ను ఎంపిక చేయలేదు.
కాగా, స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు టీమిండియా స్క్వాడ్ను బుధవారం (నవంబర్ 5) బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ సిరీస్లో గాయపడిన పంత్ గాయం కారణంగా ఇటీవల వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న పంత్ వైస్ కెప్టెన్గా తిరిగి భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. యంగ్ బ్యాటర్ శుభమాన్ గిల్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
సౌతాఫ్రికాతో మూడు ఫార్మాట్లు:
నవంబర్- డిసెంబర్ నెలలో సౌతాఫ్రికా ఇండియాలో పర్యటిస్తుంది. మూడు ఫార్మాట్ లలో టీమిండియా.. సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ సుదీర్ఘ టూర్ లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. నవంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్ న్యూఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో.. నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ జరుగుతుంది. నవంబర్ 30 న తొలి వన్డే.. డిసెంబర్ 3 న రెండో వన్డే.. డిసెంబర్ 6 న మూడో వన్డే జరుగుతుంది.
సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఇండియా జట్టు:
శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్
