మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ముంబైలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు, ఆయన అన్నకొడుకైన అజిత్ పవార్కు మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. మొత్తం పార్టీ తనవైపు ఉందని అజిత్ క్లెయిమ్చేసుకోగా, అజిత్మాటలు నమ్మొద్దని శరద్ పవార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం తెల్లవారుజామున అజిత్ పవార్తో కలిసి రాజ్భవన్కు వెళ్లిన తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ఏడుగురు తిరిగి శరద్ పవార్ దగ్గరికి వచ్చేశారు. ఆదివారం రినాయిసెన్స్ హోటల్లో జరిగిన సమావేశానికి 50 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మిస్సైన నలుగురిలో ఇద్దరు తమతో టచ్లోనే ఉన్నట్లు ఎన్సీపీ నేతలు చెప్పారు. మూడు పార్టీల ఐక్యతకు గుర్తుగా ఆదిత్య థాక్రే ఇంకొందరు నేతలతో దిగిన ఫొటోలను పవార్ తనయ సుప్రియా సులే ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘‘అధికారం ఉండొచ్చు, పోవచ్చు.. ఎప్పటికీ మిగిలేవి అనుబంధాలే’’అంటూ అజిత్ పేరెత్తకుండా సుప్రియ పెట్టిన వాట్సాప్ స్టేటస్ వైరల్ అయింది. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినందుకు విషెష్ చెప్పిన ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాకు అజిత్ పవార్ థ్యాంక్స్ చెప్పారు.
ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ భరోసా
అనూహ్యరీతిలో ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే హాజరయ్యారు. శరద్ పవార్తో కలిసి ఎన్సీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఉద్ధవ్.. సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కచ్చితంగా ఐదేండ్లు నిలబడుతుందని, సర్కారు ఏర్పాటుచేసే బలం కూడా మనకే ఉందని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోనూ థాక్రే ఇదే విషయాన్ని చెప్పారు. శివసేన ఎమ్మెల్యేలతోనూ ఆయన విడిగా సమావేశమయ్యారు. ఫ్లోర్ టెస్టుపై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చే ఉత్తర్వులను బట్టి ఫడ్నవిస్ సర్కారు కూలిపోక తప్పదని థాక్రే ఎమ్మెల్యేలతో అన్నట్లు తెలిసింది. శనివారం నాటి పరిణామాలతో మహారాష్ట్రలో బీజేపీ పతనం మొదలైందని సేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఫడ్నవిస్కు సీఎంగా కొనసాగే అర్హతే లేదని, వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మహా వికాస్ కూటమికి ఐదేండ్లూ సుస్థిర ప్రభుత్వాన్ని అందించే సత్తా ఉందని కాంగ్రెస్ లీడర్ ఫృథ్విరాజ్ చవాన్ అన్నారు. ఉద్ధవ్ సీఎం కాలేదనే బాధతో వాషిం జిల్లాకు చెందిన రమేశ్ జాదవ్ అనే శివసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
ఐదేండ్లూ మేమే ఉంటాం: బీజేపీ
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన ఆదివారం ముంబైలోని బీజేపీ ఆఫీసులో ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఫ్లోర్ టెస్టు ఎదుర్కోవాల్సి వస్తే ఎలా ముందుకెళ్లాలనేదానిపై ఫడ్నవిస్ నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి పియూష్ చావ్లా ముంబై బీజేపీ ఆఫీసుకొచ్చి ఫడ్నవీస్కు విషెస్ చెప్పారు. హైకమాండ్కు ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపుతున్న ఫడ్నవీస్.. పై నుంచి వచ్చే ఆదేశాల మేరకు పావులు కదుపుతున్నారు. మీటింగ్తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ మాట్లాడుతూ, ప్రజల తీర్పుకు విరుద్ధంగా శివసేన ప్రతిపక్షాలతో కలిసిందని విమర్శించారు. ఐదేండ్లూ ఫడ్నవీసే సీఎంగా కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు.