మోడీకి రేడియో గిఫ్ట్ గా పంపిన షర్మిల..

మోడీకి రేడియో గిఫ్ట్ గా పంపిన షర్మిల..

జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లో అడుగుపెట్టిన షర్మిల అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కడప ఎంపీగా బరిలో దిగిన షర్మిల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావన తెస్తూ జగన్, అవినాష్ రెడ్డిలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జగన్ కు నవసందేహాలంటూ బహిరంగ లఖలు రాసి వివిధ అంశాలపై ప్రశ్నలు సంధించిన షర్మిల తాజాగా ప్రధాని మోడీకి రేడియో గిఫ్ట్ గా పంపి పది ప్రశ్నలు సంధించారు.

విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చిన మోడీ ఏపీ నుంచి కదలాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్కీ బాత్ వినాలని రేడియోను గిఫ్ట్ గా పంపుతున్నట్లు తెలిపారు షర్మిల. అసలు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టే అర్హత మోడీకి లేదన్నారు షర్మిల. ఏపీకి వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు చెప్పి రావాలని సూచించారు. గిఫ్ట్ తో పాటు ప్రధాని మోడీకి పది ప్రశ్నలు కూడా సంధించారు షర్మిల.

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఇచ్చి తర్వాత మాట మరచి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని అన్నారు. జగన్ రివర్స్ టెండరింగ్ ను ఆపకుండా ప్రాజెక్ట్ ను నాశనం చేసి ఎత్తు తగ్గించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తమ చేతుల మీదుగా భూమి పూజ జరిగిన అమరావతి పదేళ్లయినా ఎందుకు పూర్తి కాలేదని అన్నారు.విశాఖ ఉక్కును అమ్మేద్దామని చూస్తూ మళ్ళీ విశాఖ మీద దొంగ ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటి హామీలను తుంగలో తొక్కి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వక్తం చేసారు షర్మిల.