
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన శ్రవణ్ రావు సీసీఎస్ పోలీసులు ముందు హాజరయ్యారు. హైదరాబాద్ సీసీఎస్ లో నమోదైన కేసులో శ్రవణ్ రావువిచారణకు హాజరయ్యారు. ఒక కంపెనీకి సరుకు సరఫరా చేయకుండానే శ్రవణ్ రావు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రూ. 6 కోట్ల వరకు మోసం చేశారని శ్రవణ్ రావు పై సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శ్రవణ్ రావుకి నోటీసులు ఇచ్చి పిలిచి విచారిస్తున్నారు పోలీసులు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాలకు పారిపోయిన శ్రవణ్ రావు ఇటీవలే ఇండియాకు వచ్చాడు. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శ్రవణ్ రావు విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. పూర్తిస్థాయిలో సిట్ విచారణకు సహకరిస్తానని కోర్టుకి చెప్పాడు. చెప్పినట్లుగానే సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు.. పోలీసులకు మాత్రం సహకరించడం లేదు. దీంతో శ్రవణ్ రావు బెయిల్ రద్దు చేయాలని మే 5న సిట్ సుప్రీంకోర్టును కోరింది. విచారణకు సహకరించడం లేదని.. బెయిట్ రద్దు చేసి కస్టడీకి అప్పగించాలని రిక్వెస్ట్ చేసింది సిట్.
ఫోన్ ట్యాపింగ్ సమయంలో రెండు సెల్ ఫోన్లు..!
గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్కు గురైన ఫోన్ నంబర్లు.. వాటిని ప్రణీత్ రావు టీమ్కు పంపించిన మొబైల్ ఫోన్ నంబర్ల ఆధారంగా.. ట్యాపింగ్లో శ్రవణ్ రావు పాత్రను సిట్ అధికారులు గుర్తించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఆధారంగా ఫోన్ నంబర్లతో లింకైన ఐఎంఈఐ నంబర్లు గుర్తించారు. వీటిలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు నంబర్ నుంచి వెళ్లిన వాట్సాప్ చాటింగ్లు, ప్రణీత్ రావుకు ఆయన పంపించిన మొబైల్ నంబర్లను గుర్తించి శ్రవణ్ రావుపై కేసు నమోదు చేసింది సిట్.