బాలీవుడ్ లో 20ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రేయా ఘోషల్

బాలీవుడ్ లో 20ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రేయా ఘోషల్

సరిగ్గా 20 సంవత్సరాల క్రితం, ఈ రోజు తన జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన చోటు చేసుకుందని ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. దేవదాస్ అనే మాగ్నమ్ ఓపస్ సినిమాతో హిందీ ఫిల్మ్ ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేశానన్న ఆమె... తనకు 18 ఏళ్ల వయసున్నపుడు ఈ సంఘటన జరిగిందన్నారు. బిగ్ స్ర్కీన్ పై తన పాటలను చూస్తున్నపుడు ఏర్పడిన ఆనందాన్ని, భయాన్ని మాటల్లో చెప్పలేనని తెలిపారు. తన చేయి పట్టుకుని మరీ సినిమా, సంగీత ప్రపంచంలోకి తీసుకొచ్చి, ఈనాడు ఇంత గొప్ప కళాకారిణిగా తీర్చిదిద్దిన తన గురువు సంజయ్‌లీలా భన్సాలీకి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకుంటానన్నారు. ఈ సందర్భంగా మరోసారి తన తల్లిదండ్రుల పాదాలకు  శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్న శ్రేయా... తాను ఈ రోజు ఈ స్థాయికి వచ్చేందుకు వారు తమ సర్వస్వాన్నిచ్చారని చెప్పారు. తనకు ఇంత అందమైన అభిమానులు, స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబాన్ని అందించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు అని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తన గాత్రాన్ని మొదటిసారిగా ఈ ప్రపంచానికి వినిపించిన దేవదాస్ చిత్రంలోని సిల్సిలా యే చాహత్ కా అనే పాట పాడుతూ ఉన్న ఓ వీడియోను శ్రేయా ఘోషల్ షేర్ చేశారు. అయితే ఇదే చిత్రంలోని ’బైరీ పియా’ పాటకు శ్రేయా.. ఉత్తమ నేపథ్యగానం కేటగిరిలో మొదటి జాతీయ అవార్డును అందుకోవడం విశేషం.