- లెక్కల్లో చురుగ్గా ఉంటే హై లెవెల్.. బలహీనమైన సబ్జెక్టుకు బేసిక్ లెవెల్
- ప్రతి స్టూడెంట్కు ట్యాబ్.. అడాప్టివ్ లెర్నింగ్తో బోధన
- సింగపూర్ విద్యా విధానాన్ని స్టడీ చేస్తున్న తెలంగాణ టీచర్లు
హైదరాబాద్, వెలుగు: క్లాస్లో టాపర్, డల్లర్ అంటూ స్టూడెంట్లను వేరు చేయకుండా.. ఎవరి సామర్థ్యానికి తగ్గట్టుగా వాళ్లకు సబ్జెక్టులు ఎంచుకునే అవకాశమిస్తోంది సింగపూర్. స్కూల్ లెవెల్ నుంచే డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇస్తూ.. విద్యార్థుల చేతికి ట్యాబ్లు అందిస్తోంది. ఏఐ, అడాప్టివ్ లెర్నింగ్ ద్వారా ఒక్కో స్టూడెంట్ స్థాయికి తగ్గట్టు పాఠాలు చెబుతోంది. ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేసే అవకాశాలను రాష్ట్ర టీచర్లు, అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నెల 12 నుంచి 40 మందితో కూడిన తెలంగాణ టీచర్లు, అధికారులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. టీఆర్ఈఐఎస్ సెక్రటరీ ఉషారాణి, స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి నేతృత్వంలో బృందం అక్కడి పలు స్కూళ్లను పరిశీలిస్తోంది. సింగపూర్ విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతోనూ భేటీ అయింది. స్టూడెంట్ల మానసిక ఉల్లాసం, డిజిటల్ ఎడ్యుకేషన్, కరికులమ్, మూల్యాంకనం, టీచర్ల నైపుణ్యాల పెంపు వంటి అంశాలను ప్రత్యక్షంగా స్టడీ చేస్తోంది.
సబ్జెక్టుకు ఒక లెవెల్..
సింగపూర్లో అమలు చేస్తున్న ‘ఫుల్ సబ్జెక్ట్-బేస్డ్ బ్యాండింగ్’ విధానం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఏ స్టూడెంట్నూ టాపర్, డల్లర్ అంటూ ముద్ర వేయరు. ఆరో తరగతి తర్వాత సెకండరీ స్థాయిలో సబ్జెక్టులను జీ1, జీ2, జీ3 లెవెల్స్గా విభజిస్తారు. లెక్కల్లో చురుగ్గా ఉన్న స్టూడెంట్ హై లెవెల్ (జీ3) తీసుకోవచ్చు. అదే సైన్స్లో కొంత వెనుకబడి ఉంటే బేసిక్ లెవెల్ (జీ1)లో చదువుకోవచ్చు. ఏ సబ్జెక్టులో పట్టుంటే అందులో హై లెవెల్కు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ఒక సబ్జెక్టులో వెనుకబడినందుకు మొత్తం చదువుపై ప్రభావం పడకుండా.. తమకు నచ్చిన సబ్జెక్టులో స్టూడెంట్లు మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ విధానంతో చదువులపై భయం తగ్గి స్టూడెంట్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. 2027 నుంచి ప్రస్తుత పరీక్షల స్థానంలో సబ్జెక్టు స్థాయిలను ధ్రువీకరించే ఏకీకృత సర్టిఫికెట్ (సెక్) విధానం అమల్లోకి రానుంది. సింగపూర్లో సాధారణ విద్యా విధానం ప్రైమరీ స్థాయితో మొదలై సెకండరీ, పోస్ట్ సెకండరీ స్థాయిల వరకు కొనసాగుతుంది. ప్రైమరీ విద్య 7 నుంచి 12 ఏళ్ల వయసు వరకు ఆరేండ్లు ఉంటుంది. 13– 16 ఏళ్లలో సెకండరీ విద్య, ఆ తర్వాత 17– 22 ఏళ్ల వరకు పోస్ట్ సెకండరీ విద్య ఉంటుంది.
చదువంటే ఇష్టంగా ఉండేలా..
పరీక్షల ఒత్తిడిని తగ్గించి ‘జాయ్ ఆఫ్ లెర్నింగ్’పై సింగపూర్ ఫోకస్ పెట్టింది. పిల్లలు బడిలో చేరకముందే వారిని పర్యవేక్షించేందుకు కిడ్స్టార్ట్, స్కూళ్లలో మానసిక ఉల్లాసం కోసం కౌన్సెలర్లు, చదువు మధ్యలో ఆపేసిన వారిని తిరిగి బడిలో చేర్పించేందుకు స్టెప్-అప్, యూత్ గో వంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ విధానాల ఫలితంగానే అంతర్జాతీయ ‘పీసా-2025’ ఫలితాల్లో సింగపూర్ మెరుగైన ఫలితాలు సాధించిందని అధికారులు చెబుతున్నారు. రీడింగ్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో, గణితం, సైన్స్లో రెండో
స్థానంలో నిలిచింది.
తెలంగాణలో అమలుపై ఫోకస్
సింగపూర్లో అమలు చేస్తున్న సామర్థ్య ఆధారిత సబ్జెక్టుల ఎంపిక, స్కూల్ స్థాయి నుంచే ఏఐ ఆధారిత డిజిటల్ విద్య, స్టూడెంట్ సెంట్రిక్ బోధన విధానాలు ఆదర్శంగా ఉన్నాయని తెలంగాణ అధ్యయన బృందం పేర్కొంది. అక్కడి బెస్ట్ ప్రాక్టీసెస్ను స్టడీ చేసి.. రాష్ట్రంలోని స్కూళ్లలో ఏయే విధానాలను అమలు చేయొచ్చనే దానిపై ప్లాన్ రూపొందించనుంది.
