క్రిటికల్​ మినరల్స్​ ఉత్పత్తి కి సింగరేణి సిద్ధం :సీఎండీ బలరాం నాయక్  

క్రిటికల్​ మినరల్స్​ ఉత్పత్తి కి సింగరేణి సిద్ధం :సీఎండీ బలరాం నాయక్  
  • కోల్​ మినిస్ట్రీ సెమినార్​లో సీఎండీ బలరాం నాయక్  

హైదరాబాద్, వెలుగు: క్రిటికల్​ మినరల్స్​ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించడానికి సింగరేణి సిద్ధంగా ఉందని ఆ సంస్థ సీఎండీ  ఎన్ బలరామ్  నాయక్​ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో సెంట్రల్​ కోల్  మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిటికల్​ మినరల్స్​ నేషనల్​ సెమినార్​లో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి గనుల్లోని బొగ్గు, మట్టి పొరల్లో ఆర్ఈఈ(రేర్ ఎర్త్  ఎలిమెంట్స్) ఉన్నట్లు ప్రాథమిక అధ్యయనాల్లో వెల్లడైందని తెలిపారు.

వీటి నుంచి క్రిటికల్​ మినరల్​ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సింగరేణి థర్మల్  పవర్​ ప్లాంట్ నుంచి విడుదలవుతున్న ఫ్లై యాష్​ను  భువనేశ్వర్ లోని ఐఎంఎంటీ లేబరేటరీల్లో టెస్ట్​ చేయగా ఆర్ఈఈ ఎలిమెంట్స్  ఉన్నట్లు తేలిందన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు అటవీ ప్రాంతంలో ప్రాధాన్యత కలిగిన ఖనిజాలు, ఆర్ఈఈ ఉనికి ఉందని, రేర్  ఎర్త్  ఎలిమెంట్స్, నియోబియం ఖనిజాలకు ఆధారాలు ఉన్నాయన్నారు.

ఓపెన్​కాస్ట్​ మైన్లు, ఎస్టీపీపీలో యాష్​లో సీరియం, లాంతనం, నియోడిమియం, ప్రెసియోడిమీయం, గాడోలినియం, డిస్పోజియం, ల్యూటేటియం వంటి 14 రకాల ఎలిమెంట్లు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. హైదరాబాద్​ ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో జరిపిన పరిశోధనల్లో రామగుండం ఓపెన్ కాస్ట్–2 గనిలో వెనాడియం, స్ట్రాంటియం, జిర్కోనియం కనుగొన్నట్లు తెలిపారు. ఈ రంగంలోకి అడుగు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, ప్రోత్సహం అందిస్తుందని సీఎండీ తెలిపారు.

సింగరేణి ఆధ్వర్యంలో త్వరలో జియో సైన్స్  ల్యాబ్​ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఎన్ఎండీసీ సంస్థతో పాటు ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్  ప్రభుత్వ ప్రతినిధి బృందంతో చర్చించామని, సలహాలు, సంప్రదింపులకు డెలాయిట్  సంస్థను కన్సల్టెంట్​గా నియమించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ప్రాధాన్యత కలిగిన ఖనిజాల వేలంలోనూ పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.