
- కోల్ మినిస్ట్రీ సెమినార్లో సీఎండీ బలరాం నాయక్
హైదరాబాద్, వెలుగు: క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించడానికి సింగరేణి సిద్ధంగా ఉందని ఆ సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ నాయక్ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో సెంట్రల్ కోల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిటికల్ మినరల్స్ నేషనల్ సెమినార్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి గనుల్లోని బొగ్గు, మట్టి పొరల్లో ఆర్ఈఈ(రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) ఉన్నట్లు ప్రాథమిక అధ్యయనాల్లో వెల్లడైందని తెలిపారు.
వీటి నుంచి క్రిటికల్ మినరల్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి విడుదలవుతున్న ఫ్లై యాష్ను భువనేశ్వర్ లోని ఐఎంఎంటీ లేబరేటరీల్లో టెస్ట్ చేయగా ఆర్ఈఈ ఎలిమెంట్స్ ఉన్నట్లు తేలిందన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు అటవీ ప్రాంతంలో ప్రాధాన్యత కలిగిన ఖనిజాలు, ఆర్ఈఈ ఉనికి ఉందని, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, నియోబియం ఖనిజాలకు ఆధారాలు ఉన్నాయన్నారు.
ఓపెన్కాస్ట్ మైన్లు, ఎస్టీపీపీలో యాష్లో సీరియం, లాంతనం, నియోడిమియం, ప్రెసియోడిమీయం, గాడోలినియం, డిస్పోజియం, ల్యూటేటియం వంటి 14 రకాల ఎలిమెంట్లు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. హైదరాబాద్ ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో జరిపిన పరిశోధనల్లో రామగుండం ఓపెన్ కాస్ట్–2 గనిలో వెనాడియం, స్ట్రాంటియం, జిర్కోనియం కనుగొన్నట్లు తెలిపారు. ఈ రంగంలోకి అడుగు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, ప్రోత్సహం అందిస్తుందని సీఎండీ తెలిపారు.
సింగరేణి ఆధ్వర్యంలో త్వరలో జియో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఎన్ఎండీసీ సంస్థతో పాటు ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో చర్చించామని, సలహాలు, సంప్రదింపులకు డెలాయిట్ సంస్థను కన్సల్టెంట్గా నియమించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ప్రాధాన్యత కలిగిన ఖనిజాల వేలంలోనూ పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.