తాగేందుకు మంచినీళ్లివ్వండి..కాసీపేట-1 బొగ్గుగనిపై సింగరేణి కార్మికుల ధర్నా

తాగేందుకు మంచినీళ్లివ్వండి..కాసీపేట-1 బొగ్గుగనిపై సింగరేణి కార్మికుల ధర్నా

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసీపేట-1 సింగరేణి బొగ్గు గనిలో పనిచేస్తున్న కార్మికులు తాగేందుకు మంచినీళ్లవ్వాలంటూ డిమాండ్​ చేస్తూ ఆందోళనకు దిగారు. శుక్రవారం మొదటి షిప్టు విధుల కాలంలో గని కార్మికులందరు మేనేజర్​ రూమ్​ ఎదుట ధర్నాకు దిగారు. వీరికి సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్, గని పిట్​అసిస్టెంట్​సెక్రటరీ వడ్లమల్ల రాజేందర్​,  లీడర్లు మద్దతుగా నిలిచారు. 20 రోజులుగా గనిపై ఉన్న డ్రింకింగ్ ​వాటర్​ ఆర్వో ప్లాంట్​ పని చేయడం లేదన్నారు.

ప్లాంట్​కు రిపేర్లు చేయాలని ఆఫీసర్ల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని నిరసన వ్యక్తంచేశారు. ఆర్వో ప్లాంట్​కు రిపేర్లు చేసి తాగునీటి సప్లై చేస్తామని గని మేనేజర్​ సతీశ్​ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన కార్మికులు,ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ లీడర్లు రంజిత్ కుమార్, ఆడెపు రవీందర్, కోల కమలాకర్  పాల్గొన్నారు.