- మంత్రి శ్రీనివాస్గౌడ్ను వేడుకున్న బాలుడు
మహబూబ్నగర్, వెలుగు: పేదరికంతో చదువుకు దూరమైన బాలుడు తనను చదివించాలంటూ మంత్రి శ్రీనివాస్గౌడ్ను వేడుకున్నాడు. పాలమూరు జిల్లా నవాబ్పేట మండలం కాకర్లపహాడ్ కు చెందిన మల్లెల వెంకటేశ్, బుజ్జమ్మ దంపతుల కొడుకు విజయ్ గతేడాది 6వ తరగతి చదివాడు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ ఏడాది బడి మానేశాడు. మైసమ్మ టెంపుల్వద్ద కూల్ డ్రింక్స్ అమ్మకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం మంత్రి శ్రీనివాస్గౌడ్ మైసమ్మ టెంపుల్ వద్ద అమ్మవారికి పూజ చేసేందుకు వచ్చారు. విజయ్ మంత్రి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి చేయి పట్టుకొని ‘సార్.. నాకు చదువుకోవాలని ఉంది’ అంటూ బోరున ఏడ్చేశాడు. స్పందించిన మంత్రి బాలుడిని తనతో పాటు పాలమూరుకు తీసుకెళ్లారు. ఓ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించారు. ఆ బాలుడికి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. బాలుడి తల్లితండ్రులకు కూడా ఉపాధి కల్పిస్తానని చెప్పారు.