- నలుగురు ఐపీఎస్లు సహా 9 మంది సభ్యులు
- ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి
- ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి, పటిష్టమైన
- చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశం
హైదరాబాద్,వెలుగు: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమగ్ర దర్యాప్తు జరిపేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యులను నియమించారు.
సిద్దిపేట సీపీ ఎస్ఎమ్ విజయ్కుమార్(ఐపీఎస్), రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా(ఐపీఎస్), మాదాపూర్ డీసీపీ రితిరాజ్(ఐపీఎస్), మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి(ఐపీఎస్), గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం. రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ కేఎస్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, టీజీ న్యాబ్ డీఎస్పీ జీహెచ్ శ్రీధర్, హెచ్ఎంఆర్ఎల్ డీఎస్పీ నాగేందర్ రావును సభ్యులుగా నియమించారు. ఉన్నతస్థాయిలో ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
ఇప్పటికే సేకరించిన ఆధారాలతో..!
ఫోన్ ట్యాపింగ్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి ఐదుగురు సభ్యులతో స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేశారు. వెస్ట్జోన్ డీసీపీ విజయ్కుమార్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కేసును దర్యాప్తు చేశారు. ఇప్పుడు డీజీపీ అధికారికంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ, ఇతర నిందితుల వాంగ్మూలాలు, సేకరించిన సాంకేతిక ఆధారాలతో సజ్జనార్ సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు సూత్రదారులు ఎవరనేది ఇప్పటికే స్పెషల్ టీమ్ ప్రాథమిక సమాచారం సేకరించింది. సిటీ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పలువురు కీలక నేతల పేర్లు పరోక్షంగా వెల్లడయ్యాయి.
ఆ నలుగురు.. 10 నెలల రిమాండ్
ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించిన మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 10 నెలలకు పైగా బెయిల్ రాకుండా కీలక ఆధారాలను కోర్టుకు అందించారు. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నాడు. ఆయనను భారత్కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియ సహా అమెరికా నుంచి డిపోర్ట్ చేయించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకున్న ప్రభాకర్ రావును చివరకు వారం రోజుల పాటు కస్టోడియల్ ఎంక్వైరీ చేశారు. దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్ ద్వారా నష్టపోయిన బాధితులు, అధికారులు కాల్ డేటా సహా వాట్సాప్, సోషల్మీడియా డేటాను పోలీసులు ఇప్పటికే సేకరించారు. వీటి ఆధారంగా సిట్ చేసే దర్యాప్తు కీలక మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి.
