- ఆరుగురు అరెస్ట్
వికారాబాద్, వెలుగు : పాత కక్షలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని మనసులో పెట్టుకొని వికారాబాద్ జిల్లా కోట్పల్లి సర్పంచ్ భర్త సంగయ్య పై దాడికి పాల్పడిన ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ధారూర్ సీఐ రఘురాములు తెలిపారు. కోట్పల్లి గ్రామానికి చెందిన రుమల్ల సంగయ్యపై ఈ నెల 18న రాత్రి సుమారు 10.40 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు.
గతంలో ఉన్న గొడవలతో పాటు, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాము ఓడిపోయామని కక్షను పెంచుకున్న నిందితులు, సంగయ్యను ఎలాగైనా కొట్టాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన సంగయ్య పరిస్థితిపై ఆయన భార్య కోట్పల్లి సర్పంచ్ బసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
ఈ కేసులో ముమ్మర దర్యాప్తు జరిపి, మొహమ్మద్ షకీర్, శివకుమార్, మొహమ్మద్ అక్రమ్, ఖురేషి అజ్మత్, మొహమ్మద్ షాన్వాస్, నక్కల బందయ్యను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బుధవారం కోట్ పల్లి సర్పంచ్ భర్త సంగయ్య కుటుంబ సభ్యులను యశోదా హాస్పిటల్ లో పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.
