మెడలో దండేసి చెంప చెళ్లుమనిపించాడు.. పార్టీ అధ్యక్షుడిని కొట్టిన కార్యకర్త.. వీడియో వైరల్

 మెడలో దండేసి చెంప చెళ్లుమనిపించాడు.. పార్టీ అధ్యక్షుడిని కొట్టిన కార్యకర్త.. వీడియో వైరల్

నాయకులకు కార్యకర్తలే బలం. ఒక నాయకుడు బయల్దేరితే నానా హంగామా చేసి హైప్ చేస్తుంటారు ఫాలోవర్స్. అలా చేయించుకుంటేనే లీడర్లకు పరపతి కూడా. కానీ పార్టీ అధ్యక్షుడినే చెంప చెళ్లుమనేలా బహిరంగ కార్యక్రమంలో కొడితే ఎలా ఉంటుంది..? దండేసి గౌరవించి.. అధ్యక్షుడిని ఆనందంలో ముంచేసి.. వెంటనే చెంప పగలగొట్టాడు ఆయన ఫాలోవర్.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లో జరిగింది ఈ ఘటన. సుహెల్దేవ్ స్వాభిమాన్ పార్టీ (SSP) అధ్యక్షుడు మహేంద్ర రాజ్భర్ కు బహిరంగ కార్యక్రమంలో ఘోర అవమానం జరిగింది. జాన్పూర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో మహేంద్ర రాజ్ భర్ ను  అతని అనుచరుడు బ్రిజేష్ రాజ్ భర్ కొట్టడం వైరల్ గా మారింది. 

మహారాజ సుహెల్దేవ్ విజయ దివాస్ సందర్భంగా భూమి పూజలో పాల్గొన్న పార్టీ అధ్యక్షుడికి ఈ రకంగా షాక్ ఇచ్చాడు ఆయన అనుచరుడు. మొదట దండ వేసి ఆయనను పొగడ్తలతో ముంచెత్తిన అనుచరుడు.. ఆ తర్వాత చెయ్యి ఎత్తి పళా పళా రెండు మూడు దెబ్బలు చెంపమీద కొట్టాడు. దీంతో అలెర్ట్ అయిన అనుచరులు అతన్ని అడ్డుకున్నారు. 

‘‘జలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో భూమిపూజకు ముఖ్య అతిథిగా వెళ్లాను. ఈవెంట్ ముంగించే ముందు నేను స్పీచ్ ఇవ్వబోతుండగా.. పూలమాల వేసి ఆ తర్వాత అనూహ్యంగా నాపై దాడి చేశాడు. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంలో మంత్రి సమక్షంలోనే నాపై దాడి చేశారు.’’ అని  (SSP) అధ్యక్షుడు మహేంద్ర రాజ్భర్ చెప్పారు. 

యోగి ప్రభుత్వం దాడులకు నిదర్శనం: మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్

SSP) అధ్యక్షుడు మహేంద్ర రాజ్భర్ పై దాడిని సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఖండించారు. ఉత్తరప్రదేశ్ లో పెరుగుతున్న దాడుల సంస్కృతికి ఇది నిదర్శనమని విమర్శించారు. మంత్రులు దగ్గరుండి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. దళితులు, మైనారిటీలు, బీసీలపై ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.