ఆర్టీసీలో స్లీపర్​ క్లాస్​!: ఉన్న బస్సులతోనే మార్పులు

ఆర్టీసీలో స్లీపర్​ క్లాస్​!: ఉన్న బస్సులతోనే మార్పులు

ఉన్న బస్సులనే మార్పులు చేయనున్న సంస్థ
దూర ప్రయాణాలకు మస్తు డిమాండ్​
ఒక్కో బస్సుకు రూ.5 లక్షలకు పైగా ఖర్చు
ప్రభుత్వం వద్దకు ఆర్టీసీ ప్రతిపాదనలు

హైదరాబాద్​, వెలుగు: ప్రైవేట్​ మాదిరిగానే ఆర్టీసీ బస్సుల్లోనూ స్లీపర్​ క్లాస్​ అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ఉన్నతాధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతమున్న బస్సుల్లోనే కొన్నింటిని స్లీపర్​ బస్సులుగా మార్చి త్వరలోనే రోడ్డెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో బస్సుకు రూ.5 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే బస్సులను స్లీపర్​ క్లాసులుగా మార్చే పనిని మొదలుపెట్టనున్నారు.

ఇప్పటిదాకా ప్రైవేట్​లోనే..

ఆర్టీసీలో 9,754 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతున్నాయి. అందులో 6,579 బస్సులు ఆర్టీసీవి కాగా.. మిగతా 3,175 అద్దె బస్సులు. ఉమ్మడి ఆర్టీసీలో ఒకట్రెండు మాత్రమే స్లీపర్​ క్లాస్​ బస్సులుండేవి. తెలంగాణ వచ్చాక ఆ ఒక్కటీ లేకుండా పోయింది. ఈ మధ్య దూర ప్రయాణాలు చేసేటోళ్లు స్లీపర్​ క్లాస్​ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో స్లీపర్​ క్లాస్​ లేకపోవడంతో ప్రైవేట్​ ట్రావెల్స్​లో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. చార్జీ ఎక్కువే అయినా సౌకర్యం ఉంటుందన్న ఉద్దేశంతో స్లీపర్​ క్లాసులవైపే చూస్తున్నారు. దీంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ కూడా స్లీపర్​ క్లాస్​లను సిద్ధం చేయబోతోంది.

మధ్యతరగతోళ్లకు నాన్​ ఏసీ స్లీపర్​..

ప్రస్తుతం పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయిన ఆర్టీసీకి కొత్త బస్సులు కొనేంత స్థోమత లేదు. దీంతో ఉన్న బస్సులను స్లీపర్​ క్లాస్​లుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఏసీ బస్సులు అయిన గరుడ ప్లస్​, రాజధాని బస్సుల్లో కొన్నింటిని మోడిఫై చేయనున్నారు. మధ్యతరగతి జనాన్ని దృష్టిలో పెట్టుకుని నాన్​ ఏసీ స్లీపర్​ క్లాస్​ బస్సులనూ తయారు చేయనున్నారు. దూర ప్రాంతాలన్నింటికీ బస్సులను నడపాలని ఆలోచన చేస్తున్నారు. అయితే బస్సులను స్లీపర్​ క్లాసులుగా మార్చాక రవాణా శాఖ అనుమతివ్వాల్సి ఉంటుంది. మోటార్​ వాహన చట్టం నిబంధనల ప్రకారం ఫిట్​నెస్​, తదితర అంశాలన్నింటినీ పరిశీలించి వాటికి అనుమతులు మంజూరు చేస్తారు.