
- సారం తెల్వక.. ఇష్టారాజ్యంగా ఎరువుల వినియోగం
- ఏఈవోలకు ఇచ్చిన కిట్లలో కెమికల్ లేక నిలిచిన టెస్టులు
- సాయిల్ టెస్ట్లు అందుబాటులో లేక రైతుల ఇబ్బందులు
హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్ ముగిసి, వానాకాలం సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్న టైంలో, భూసార పరీక్షలు చేయించుకునే అవకాశం లేకుండా పోతోంది. దీంతో భూసారం ఎంతనేది తేలక లెక్కాపత్రం లేక ఇష్టారాజ్యంగా ఎరువుల వినియోగం జరుగుతోంది. ఫలితంగా దేశంలోనే ఎక్కువ ఎరువులు వినియోగించే రాష్ట్రంగా నిలుస్తోంది.
విత్తనాలు, ఎరువులు, సాగు శిక్షణ కోసం క్లస్టర్ పరిధిలో రైతు వేదికలు నిర్మించినప్పటికీ, భూసార పరీక్షల నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దిగుబడి పెంచడంలో కీలకమైన భూసార పరీక్షల కోసం ప్రభుత్వం రైతు వేదికల్లో సాయిల్టెస్ట్కిట్లు అందజేసినప్పటికీ, అవసరమైన రసాయనాలు లేకపోవడంతో ఈ కిట్లు నిరుపయోగంగా మారుతున్నాయి.
రైతు వేదికల్లో ఏర్పాట్లు కరువు
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సుమారు 1.34 కోట్ల ఎకరాలు ఉండగా.. 70 లక్షలకు పైగా రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వీరికి సేవలందించేందుకు 2,601 రైతు వేదికలు అందుబాటులో ఉన్నాయి. 2,600 మందికి పైగా ఏఈవోలు ఉన్నారు. భూసార పరీక్షలతో నేలలోని నత్రజని, భాస్వరం, పొటాష్, జింక్, సూక్ష్మపోషకాలు, సేంద్రియ పదార్థాల స్థాయిని తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా అవసరమైనంత మేరకే ఎరువులు వాడటం వల్ల పెట్టుబడి తగ్గడమే కాకుండా, మంచి దిగుబడి సాధ్యమవుతుంది. అయితే, రసాయన ఎరువులను ఇష్టారీతిన వాడుతున్న రైతులు, భూసార పరీక్షలు లేకపోవడంతో నేల రకం, ఎరువుల వినియోగం గురించి తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నారు.
మట్టి నమూనాలు సేకరించాలిలా..
ఒక ఎకరం పొలంలో 8 నుంచి -10 ప్రదేశాల నుంచి 6 అంగుళాల లోతు వరకు మట్టి నమూనాలు సేకరించాలి. రైతు పేరు, చిరునామా, ఖాసరా నంబర్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పంట వివరాలు రాసి, గుడ్డ సంచిలో నమూనాలు పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతం, రైతు వేదికల్లో సదుపాయాలు కల్పించే వరకు, స్థానిక ఏఈవోల ద్వారా జిల్లా ప్రయోగశాలలకు నమూనాలు పంపి, పరీక్షలు చేయించుకోవచ్చు.
ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
రైతు వేదికల్లో భూసార పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు, వ్యవసాయ నిపుణులు కోరుతున్నారు. వసతులు కల్పించి, నిధులు సద్వినియోగం చేస్తే, రైతులు సకాలంలో భూసార వివరాలు తెలుసుకుని, అవసరమైన ఎరువులు మాత్రమే వాడటం ద్వారా పెట్టుబడి తగ్గించుకోవడమే కాక, దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇది నేల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవేవి చేయక పోవడంతో రైతులు అవసరం ఉన్నా లేకపోయినా ఇష్టారీతిన రసాయన ఎరువులు వాడుతున్నారు. పరీక్షలతోనే నేల రకం.. ఎరువుల వినియోగం గురించి తెలుస్తుంది. భూమిలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాష్, జింక్, సూక్ష్మపోషకాలు, సేంద్రియాల మోతాదును తెలుసుకోవచ్చు. ఫలితంగా అవసరమున్నంత మేరకే ఎరువులు వినియోగించడం వల్ల పెట్టుబడి తగ్గడమే కాకుండా మంచి దిగుబడి వస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నరు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కార్యరూపం దాల్చని ప్రభుత్వ నిర్ణయం
గతంలో రైతు వేదికల్లో భూసార పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. నేటికీ అమలు కాలేదు. ఏఈవోలకు అందజేసిన కిట్లలో అవసరమైన కెమికల్స్లేకపోవడంతో పరీక్షలు నిలిచిపోయాయి. ప్రస్తుతం, కొన్ని జిల్లాల్లో రైతులు మట్టి నమూనాలు సేకరించి స్థానిక ఏఈవోలకు అందజేస్తే, వారు జిల్లా స్థాయి ప్రయోగశాలలకు పంపి పరీక్షలు చేయిస్తున్నామని చెబుతున్నారు. ఇదంతా తూతూ మంత్రంగా జరుగుతున్నదనే విమర్శలు వస్తున్నాయి.