- వివాదాల్లో చిక్కుకుంటున్న ఎస్సైలు
- ల్యాండ్ సెటిల్మెంట్స్, ఇసుక మాఫియాలో డైరెక్ట్గా ఇన్వాల్వ్
- మర్డర్ కేసులనూ తారుమారు చేసేందుకు వెనుకాడని పోలీసులు
- నల్గొండ జిల్లాలో 7 నెలల్లో 8 మందిపై వేటు
- ఒకరు సస్పెండ్, ఏడుగురు వీఆర్కు..
- పొలిటికల్ ఒత్తిళ్లతో రచ్చకెక్కుతున్న ఖాకీల పరువు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఖాకీలు వివాదాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలతో పోలీసుల తీరు వివాదాస్పదం అవుతోంది. ల్యాండ్ సెటిల్మెంట్స్, ఇసుక మాఫియా, మర్డర్ కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో గడిచిన 7 నెలల్లో 8 మంది ఎస్సైలపై వేటు పడింది. వీరిలో ఒకరు సస్పెండ్ కాగా, మరో ఏడుగురిని వీఆర్కు పంపించారు. ఒక్క జూన్లోనే ముగ్గురు ఎస్సైలను వీఆర్కు అటాచ్ చేయడం గమనార్హం. ఇటీవలే కేతేపల్లి ఎస్సైపై వేటు పడింది. కొప్పోలులో దళిత బాలిక మృతికి సంబంధించిన కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఆయనను విధుల నుంచి తప్పించారు. మిగిలిన ఏడుగురు ఎస్సైలు కూడా పలు వివాదాల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడంతో ఉన్నతాధికారులు కొరడా ఝులిపించారు.
ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇసుక రవాణాపై ఫోకస్
కరోనా కారణంగా జిల్లాలో క్రైం రేట్ కంట్రోల్లోనే ఉన్నట్లు కనిపిస్తున్నా ఖాకీల నిర్వాకం చూస్తే మాత్రం తెరవెనుక జరుగుతున్న సెటిల్మెంట్లు కంట్రోల్ తప్పినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల పరిధిలోని పీఎస్లలో డ్యూటీ చేస్తున్న ఎస్సైలపైనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గాల్లో పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం, లీడర్ల మధ్య గ్రూప్ తగాదాలు ముదిరిపోవడంతో ఆ ఉచ్చులో పోలీసులు చిక్కుకుంటున్నారు. పొలిటికల్ సపోర్ట్ను అడ్డం పెట్టుకునేందుకు కొందరు ఎస్సైలు పూర్తిగా లీడర్లకే దాసోహం అవుతున్నారు. సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోవద్దని చట్టం చెప్తున్నా పట్టించుకోకుండా, కొందరు ల్యాండ్ సెటిల్మెంట్స్పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. పోలీసులు, పొలిటికల్ లీడర్లు కుమ్ముక్కై ఇసుక మాఫియా నడిపిస్తున్నారు. ఇల్లీగల్ రీచ్లు ఏర్పాటు చేసుకుని ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కొందరు పోలీసులైతే మరో అడుగు ముందుకేసి ఏకంగా మర్డర్ కేసులను సైతం తారుమారు చేసేందుకూ వెనుకాడడం లేదు. నేరేడుగొమ్ము, కేతేపల్లి పీఎస్ల పరిధిలో జరిగిన మర్డర్ కేసుల్లో ఎస్సైలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో వారిద్దరినీ వీఆర్కు అటాచ్ చేశారు.
పొలిటికల్ సపోర్ట్తో అవినీతి, అక్రమాలు
పొలిటికల్ సపోర్ట్ అడ్డం పెట్టుకుంటూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కొందరు ఎస్సైల తీరుతో డిపార్ట్మెంట్ ప్రతిష్టకు భంగం వాటిల్లుతోంది. గత 7 నెలల్లో విచారణలో చిక్కిన ఎస్సైలంతా ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇసుక మాఫియా, అక్రమ వసూళ్లు, కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నించడం, ఫిర్యాదులను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. వీరిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకున్నారు. పీఏపల్లి మండలం గుడిపల్లి ఎస్సైని సస్పెండ్ చేయగా, నేరేడుగొమ్ము, మిర్యాలగూడ రూరల్, కేతేపల్లి, మర్రిగూడ, చండూరు, నాంపల్లి, నిడమనూరు ఎస్సైలను వీఆర్కు అటాచ్ చేశారు. వీళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా రిక్రూట్ అయిన ఎస్సైలే ఎక్కువగా ఉండడం గమనార్హం.
యాదాద్రి, సూర్యాపేటలోనూ సేమ్
యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలోనూ పోలీసులు ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు. యా దాద్రి జిల్లా అడ్డగూడూరులో ఇటీవల జరిగిన మరియమ్మ లాకప్డెత్ కేసు విషయంలో ఎస్సై సస్పెం డ్ అయ్యారు. అదే విధంగా ల్యాండ్ ఇష్యూలో తలదూర్చినందుకు మోత్కూరు ఎస్సై ట్రాన్స్ఫర్ కాగా, గుండాల ఎస్సై ఏసీబీకి చిక్కాడు. చౌటుప్పల్లో కూడా ఓ ల్యాండ్ వివాదంలోనే ఎస్సై, సీఐని హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేశారు. సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి, నాగారం ఎస్సైలు సైతం పలు వివాదాల్లో
చిక్కుకున్నారు.
కఠిన చర్యలు తప్పవు
చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవు. పోలీసులు విధి నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించాలి. చట్టాన్ని తప్పుతోవ పట్టించాలని చూస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలువురు ఎస్సైలను వీఆర్కు అటాచ్ చేశాం. ప్రవర్తనలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడం.
- డీఐజీ ఏవీ రంగనాథ్, నల్గొండ