పొలం కోసం తల్లిని చంపిన కొడుకు

పొలం కోసం తల్లిని చంపిన కొడుకు

లింగంపేట, వెలుగు: రెండు ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరున రాయలేదని కన్న తల్లిని గొంతు నులిమి చంపాడో కొడుకు. ఎల్లారెడ్డి సీఐ రాజశేఖర్​తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన వరిగొంతం ఎల్లవ్వ(48) కొడుకు కృష్ణుడు అలియాస్ రాజు. ఎల్లవ్వ పేరిట రెండు ఎకరాల పొలం ఉంది. దాన్ని తన పేరు మీద పట్టా చేయాలని కృష్ణుడు కొన్నిరోజులుగా తల్లిని కోరుతున్నాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దాంతో కృష్ణుడు ఆదివారం రాత్రి భార్య లక్ష్మితో కలిసి తల్లిని గొంతు నులిమి హత్య చేశాడు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న సీఐ, లింగంపేట ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తామే చంపినట్లు నిందితులు ఒప్పుకోవడంతో కేసు ఫైల్​ చేసి అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు.

రైతు బీమా పైసల కోసమే: గ్రామస్తులు
అడిగినప్పుడల్లా ఎల్లవ్వ డబ్బులు ఇవ్వకపోవడంతో కృష్ణుడు తల్లిపై కోపం పెంచుకున్నాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. తల్లిని చంపితే రైతు బీమా పథకం కింద రూ.5 లక్షలు, భూమి వస్తాయనే దురాశతో చంపేశాడని చెప్పుకుంటున్నారు.