పక్కా ప్లాన్తో చంపి ప్రమాదమని నమ్మించే యత్నం
మెదక్ జిల్లా తిప్పనగుల్లలో ఘటన
రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఈ నెల 16 నాటి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. బీమా డబ్బుల కోసం కన్నకొడుకే తండ్రికి కరెంట్ షాకిచ్చి చంపేశాడని విచారణలో తేల్చారు. మండలంలోని తిప్పనగుల్లకు చెందిన గుర్రాల చంద్రం (42) కొడుకు దయాకర్ (20) పని చేసుకోకుండా తిరుగుతుండటంతో తండ్రి మందలించాడు. దీంతో కొడుకు కక్ష పెంచుకున్నాడు. బీమా డబ్బులు, ట్రాక్టర్ రుణమాపీ, వెహికల్ ఇన్సూరెన్సులు కూడా వస్తాయని తండ్రిని చంపాలనుకున్నాడు. ఊళ్లోని కిరాణా షాపులో ఇనుప బైండింగ్ వైర్ కొని వాళ్ల పొలంలో బోరు మోటారు స్టాటర్ ఫ్యూజ్కు షాక్ కొట్టేలా కనెక్షన్ ఇచ్చాడు. రోజూలాగే బోరు మోటార్ స్టార్ట్ చేయడానికి వెళ్లిన చంద్రం షాక్ తగిలి మరణించాడు. తొలుత ప్రమాదవశాత్తు మరణమేనని పోలీసులు అనుకున్నారు. కానీ అనుమానం రావడంతో దయాకర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. అతన్ని అరెస్టు చేసి బుధవారం జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.