కొత్వాలి : ఆస్తిని పంచి ఇవ్వకపోవడంతో తండ్రిని కుమారుడు, తన బావతో కలిసి హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ వారం రోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కౌషాంబి జిల్లాలోని బరియావా గ్రామానికి చెందిన అర్జున్ లాల్ దివాకర్ ను తన కుమారుడు తరచూ ఆస్తి పంచి ఇవ్వాలని వేధించేవాడు. కొడుకు చర్యలకు విసుగు చెందిన అర్జున్ లాల్ చిత్రకూట్ లో సీతాపూర్ పట్టణంలోని తన అల్లుడి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెద్దకొడుకు రాజ్ కుమార్ దివాకర్ తన బావ శైలేశ్ చౌదరి, మరో స్నేహితుడితో కలిసి ఈ నెల 18న చిత్రకూట్ చేరుకున్నారు. తెల్లవారుజాము 5 గంటలకు టెర్రస్ మీద నిద్రిస్తున్న అర్జున్ లాల్ ను వారు కత్తులతో దారుణంగా పొడిచి మత్య చేశారు.
వృద్ధుడి అరుపులకు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో నిందితులు తమ బైక్ను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా హత్యకు పాల్పడింది అర్జున్లాల్ పెద్ద కుమారుడిగా గుర్తించి కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు.