కర్నాటక డిప్యూటీ సీఎం వెల్లడి
బెంగళూరు : బెంగళూరులో జరగనున్న ప్రతిపక్షాల మీటింగ్కు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ‘‘ఇదివరకే ప్రకటించినట్లు ఈ నెల 17, 18 తేదీల్లో దేశంలోని అన్ని ప్రతిపక్షాల నేతల సమావేశం బెంగళూరులో జరగనుంది. ఈ మీటింగ్కు ప్రతిపక్ష నేతలందరూ హాజరుకానున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలంటూ సోనియా గాంధీని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరారు.
దీనిపై సోనియా సానుకూలంగా స్పందించినట్లు, మీటింగ్కు హాజరవుతానని చెప్పినట్లు మాకు మెసేజ్ వచ్చింది” అని డీకే వెల్లడించారు. అలాగే, రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినందుకు నిరసనగా ఈ నెల 12న ఇక్కడి ఫ్రీడమ్ పార్క్ వద్ద మౌన దీక్ష చేపట్టనున్నట్లు డీకే శివకుమార్ తెలిపారు.