కేంద్రంపై సోనియా గాంధీ ఫైర్ : ప్రజలు కష్టాల్లో ఉంటే .. పెట్రో రేట్లు పెంచుతరా?

కేంద్రంపై సోనియా గాంధీ ఫైర్ : ప్రజలు కష్టాల్లో ఉంటే .. పెట్రో రేట్లు పెంచుతరా?

కష్టకాలంలో పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన్రు
ఎక్సైజ్ డ్యూటీ పెంచిన్రు 
ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ చీఫ్ లెటర్

న్యూఢిల్లీ: ప్రజలపై భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలను ఎన్నుకుంటారని, జనం ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేయడానికి కాదని సోనియా గాంధీ చెప్పారు. పెట్రో ధరల్లో రోజువారీ మార్పుల వల్ల సామాన్యుడికి లాభం కలగాలని.. కానీ ఇలా చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. ప్రజల కష్టాలు, బాధలను క్యాష్ చేసుకుంటోందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్‌‌‌‌పై అన్యాయంగా అధిక ఎక్సైజ్ డ్యూటీ విధించే విషయంలో ఎంతో ఉత్సాహంతో ఉందంటూ ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆదివారం మూడు పేజీల లెటర్ రాశారు.

క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా..

‘‘ఓ వైపు దేశంలో ఓ పద్ధతి ప్రకారం జాబ్స్ తీసేస్తున్నారు. వేతనాల్లో కోత విధిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మరిన్ని ఇక్కట్లు పడుతున్నారు. దురదృష్టవశాత్తు.. ఇలాంటి బాధాకర సమయంలో ప్రజల బాధలు, కష్టాల నుంచి లాభం పొందాలని ప్రభుత్వం చూస్తోంది” అని సోనియా ఆరోపించారు. ‘‘అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా  మన దగ్గర పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు సగానికి పడిపోయాయి. అయినా రెండు వారాలుగా రేట్లు పెరుగుతున్నాయి” అని మండిపడ్డారు.

820 శాతం పెంచారు..

కేంద్ర ప్రభుత్వం డీజిల్​పై 820 శాతం ఎక్సైజ్ డ్యూటీ పెంచిందని సోనియా ఆరోపించారు. అదే పెట్రోల్​పై 258 శాతం పెంచిందని చెప్పారు. గత ఆరున్నరేళ్లలో ఇలా రూ.21 లక్షల కోట్ల ఆదాయం పొందిందని తెలిపారు. ‘‘ఢిల్లీలో నాన్ సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.769కి పెంచడం (పలు రాష్ట్రాల్లో రూ.800 పైనే ఉంది) క్రూరత్వం. ఇది ప్రజలపై ఎంతో ప్రభావం చూపింది. గత డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా రెండున్నర నెలల్లోనే ఒక్కో సిలిండర్​పై రూ.175 పెంచడమేంటి? దీనికి సర్కారు ఏం చెబుతుంది?” అని ప్రశ్నించారు.