త్వరలో ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీ
మంత్రి హరీశ్ రావు వెల్లడి
సిద్దిపేట, వెలుగు: త్వరలోనే ఉర్దూ మీడియం స్కూళ్లలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్రావు తెలిపారు. గతంలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్లలో మిగిలిపోయిన పోస్టులను రీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్టు చెప్పారు. హజ్యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన వాళ్లను సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులు లేకపోవడంతో గత నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టులు భర్తీ కాలేదని, స్పెషల్ నోటిఫికేషన్తో వాటిని భర్తీ చేస్తామని చెప్పారు.
మైనార్టీ రెసిడెన్షియల్ ఉర్దూ స్కూళ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిద్దిపేటలో రానున్న జిల్లా లైబ్రరీలో ఉర్దూ విభాగం ఉంటుందన్నారు. నిరుపేద ముస్లింలను సొంత ఖర్చుతో ఉమ్రా యాత్రకు పంపడం సంతోషాన్నిచ్చిందని, వచ్చే ఏడాది సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి 20 మందిని పంపిస్తానన్నారు.