
కేప్ టౌన్: సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు (ఎస్ఏసీఏ) చర్యలపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆ దేశ క్రికెటర్లు స్ట్రయిక్ చేయాలని భావిస్తున్నారు. బోర్డు నిర్ణయాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇంగ్లండ్తో నాలుగు టెస్ట్ల సిరీస్కు దూరంగా ఉండాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో సెంచూరియన్లో బాక్సింగ్ డే రోజు ఇరుజట్ల మధ్య మొదలయ్యే తొలి టెస్ట్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లండ్ మ్యాచ్లపై ఎలాంటి ప్రభావం లేకపోయినా.. దానిని కొట్టి పారేయలేమని ఎస్ఏసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోనీ ఐరిష్ తెలిపాడు. ‘మెరుపు సమ్మెకు వెళ్లొద్దని మేం ఆటగాళ్లను కోరుతున్నాం. వాళ్లతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంటర్నేషనల్ షెడ్యూల్కు ఆటంకం కలిగితే ఇబ్బందులు వస్తాయి. దీనిని మైండ్లో పెట్టుకుని క్రికెటర్లు నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాం’ అని ఐరిష్ పేర్కొన్నాడు. సౌతాఫ్రికా డొమెస్టిక్ టోర్నీల స్ట్రక్చర్ మార్చాలని చూస్తున్న బోర్డు.. ప్రస్తుతం ఉన్న ఆరు ఫ్రాంచైజీలను 12 కు పెంచాలని భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని క్రికెటర్ల అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఫ్రాంచైజీల సంఖ్య పెంచడం వల్ల క్రికెటర్ల ఆదాయం భారీగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. బోర్డులో నెలకొన్న అవినీతి కూడా ఈ స్ట్రయిక్కు మరో కారణంగా తెలుస్తోంది.