సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించినా.. బౌలింగ్ లో ఘోరంగా విఫలం కావడంతో మన జట్టుకు పరాజయం తప్పలేదు. మార్కరం (110) సెంచరీకి తోడు మాథ్యూ బ్రీట్జ్కే (68), డేవాల్డ్ బ్రేవీస్ (54) హాఫ్ సెంచరీలతో సౌతాఫ్రికాకు విజయం అందించారు. బుధవారం (డిసెంబర్ 3) రాయ్పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించి టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చింది. కోహ్లీ (102), గైక్వాడ్ (105) సెంచరీలు వృధా అయ్యాయి.
మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో 359 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్ ను 1-1 తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో వన్డే విశాఖపట్నం వేదికగా డిసెంబర్ 6న జరుగుతుంది.
మార్కరం సెంచరీ:
358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు మంచి ఆరంభం లభించలేదు. 8 పరుగుల వద్ద ఓపెనర్ డికాక్ ను అర్షదీప్ సింగ్ ఔట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఈ దశలో కెప్టెన్ బవుమా, మార్కరం కలిసి సఫారీల ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లారు. ఇండియా బౌలర్లను అలవోకగా ఆడుతూ పరుగులు రాబట్టారు. వీరిద్దరి జోడీ రెండో వికెట్ కు 101 పరుగులు జోడించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మార్కరం తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ప్రసిద్ కృష్ణ విడగొట్టాడు. ఒక షార్ట్ బాల్ వేసి బవుమా(47)ను ఔట్ చేశాడు.
బ్రీట్జ్కే, బవుమా ధనాధన్:
బవుమా ఔటైనప్పటికీ మార్కరం మాథ్యూ బ్రీట్జ్కేతో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మూడో వికెట్ కు 70 పరుగులు జోడించి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశారు. ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన మార్కరం తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించిన మార్కరం.. హర్షిత్ రానా ఔట్ చేసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. మార్కరం ఔటైన తర్వాత క్రీజ్ లో మాథ్యూ బ్రీట్జ్కే, దేవాల్డ్ బ్రేవీస్ టీమిండియా బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. వేగంగా ఆడుతూ ఇండియాను టెన్షన్ పెట్టారు.
కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో బ్రేవీస్ ఔటైన తర్వాత మాథ్యూ బ్రీట్జ్కే,టోనీ డి జోర్జీ జాగ్రత్తగా మ్యాచ్ ను చివరి వరకు తీసుకొచ్చారు. ప్రసిద్ కృష్ణ హాఫ్ సెంచరీ చేసి ఊపు మీదున్న బ్రీట్జ్కేను ఔట్ చేశాడు. చివర్లో కార్బిన్ బాష్ వేగంగా ఆడి సఫారీలకు విన్నింగ్ రన్స్ కొట్టాడు. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, అర్షదీప్ సింగ్ రెండు.. హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.
టీమిండియా భారీ స్కోర్:
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ (102) సిరీస్ లో వరుసగా రెండో సెంచరీ చేయడంతో పాటు యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (105) కూడా శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇండియా 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. 105 పరుగులతో గైక్వాడ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు పడగొట్టాడు. బర్గర్, ఎంగిడి తలో వికెట్ తీసుకున్నారు.
ఈ సిరీస్ లో వరుసగా రెండోసారి టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. తొలి వికెట్ కు రోహిత్ శర్మ, జైశ్వాల్ 40 పరుగులు జోడించి పర్వాలేదనిపించారు. ఈ దశలో బర్గర్ వేసిన పోక అద్భుతమైన డెలివరీకి 14 పరుగులే చేసి రోహిత్ శర్మ పెవిలియన్ కు చేరాడు. వరుసగా మూడు వన్డేల్లో 50కి పైగా పరుగులు చేసిన తర్వాత హిట్ మ్యాన్ విఫలమయ్యాడు. బర్గర్ బౌలింగ్ లో వికెట్ కీపర్ డికాక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాసేపటికే ఇండియా జైశ్వాల్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ నిరాశపరిచిన జైశ్వాల్ 22 పరుగులకే ఔటయ్యాడు.
2ND ODI. South Africa Won by 4 Wicket(s) https://t.co/oBs0Ns6SqR #TeamIndia #INDvSA #2ndODI @IDFCfirstbank
— BCCI (@BCCI) December 3, 2025
62 పరుగులకే రెండు వికెట్లు పడిపోయిన భారత జట్టును గైక్వాడ్, కోహ్లీ ఆదుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలను అలవోకగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. క్రీజ్ లో కుదురుకున్నాక దూకుడుగా ఆడి భారీ స్కోర్ కు బాటలు వేశారు. ఈ క్రమంలో మొదట గైక్వాడ్ 77 బంతుల్లో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. కాసేపటికే కోహ్లీ కూడా 90 బంతుల్లో శతకం బాదాడు. మూడో వికెట్ కు గైక్వాడ్, కోహ్లీ కలిసి ఏకంగా 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీలు చేసిన వెంటనే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. రాహుల్ తొలి వన్డే మాదిరిలా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ 43 బంతుల్లోనే 66 పరుగులు చేసి స్కోర్ ను 350 పరుగులు దాటించాడు.
