కరోనా ఎఫెక్ట్ తో భారీగా ఆదాయం కోల్పోయింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఇప్పట్లో ప్యాసింజర్ రైళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నయా ఆదాయ మార్గాల వైపు చూస్తోంది. అందులో భాగంగానే వస్తువుల రవాణాపై దృష్టి పెట్టింది. ఇప్పటికే గూడ్స్ రైళ్లను పెంచి.. నిత్యావసర వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సరుకులతో పాటు బొగ్గు, సిమెంట్, ఐరన్ రవాణా చేస్తోంది. దేశంలోనే మొదటి కిసాన్ రైలు, కార్గో రైళ్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.
సరుకుల రవాణా కోసం డివిజనల్ స్థాయి బ్రాంచ్ లను కూడా ఏర్పాటు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే . బిజినెస్ డెవలప్ మెంట్ యూనిట్ల పేరుతో వీటిని అందుబాటులో తీసుకొచ్చింది. ఇప్పుడు సరుకుల రవాణాకు రిజర్వేషన్ పద్దతిని అందుబాటులోకి తేనుంది. దీనికి రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. దేశంలోనే మొదటి సారిగా సౌత్ సెంట్రల్ రైల్వేలో అమల్లోకి రానుంది. దీని ద్వారా వినియోగదారులకు కావాల్సినంత పార్సిల్ స్పేస్ ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లకు అవసరం మేరకే.. లగేజ్ బోగిలు అమర్చే వారు. కానీ ఇక నుండి ప్రతీ ప్యాసింజర్ రైలుకు ఒక పార్సిల్ వ్యాగన్ అటాచ్ కానుంది. ఈ పార్సిల్ వ్యాగన్ లో కావాల్సినంత స్పేస్ ను వినియోగదారులు రిజర్వేషన్ చేసుకోవచ్చు . అయితే సరుకుల రవాణాకు రిజర్వేషన్ చేసుకోవాలంటే..4 నెలల ముందు బుకింగ్ చేసుకోవాల్సి వుంటుంది. బుక్ చేసుకున్న సమయంలో.. 10 శాతం అమౌంట్ చెల్లించాలి. మిగితా అమౌంట్.. రైలు బయలుదేరే 72 గంటల ముందు చెల్లించాలి. బుకింగ్ రద్దు చేసుకోవాలంటే.. అదే 72 గంటల ముందు క్యాన్సల్ చేసుకోవాలి. ఎవరైనా బుకింగ్ క్యాన్సల్ చేసుకుంటే.. చెల్లించిన అమౌంట్ లో 50 శాతం మాత్రమే రైల్వే తిరిగి ఇవ్వనుంది. ఇక గూడ్స్ రైళ్ల వేగాన్ని కూడా పెంచేశారు అధికారులు. గంటకు 20 నుండి 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లే గూడ్స్ రైళ్లు ఇప్పుడు గంటకి 50 కిలో మీటర్ల వేగానికి వెళ్తున్నాయి.