చేవెళ్ల, వెలుగు: ఎల్- నినోను సమష్టిగా ఎదుర్కొందామని అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో మిషన్ మోడ్లో పనిచేయాలని సూచించారు. ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్ లో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పెసర, కంది, జొన్న, రాగులు వంటి పంటలను ప్రోత్సహించి, రైతులకు విత్తనాలను కూడా సరఫరా చేయాలని సూచించారు. పశుగ్రాసం కొరత, తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యాన పంటలు, పండ్ల తోటలు, పూల సాగుపై దృష్టి సారించాలన్నారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల యాక్షన్ ప్లాన్, కంటింజెన్సీ ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం తెలంగాణ జలసిరి పోస్టర్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, వీర్లపల్లి శంకర్, మనోహర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్లు సవ్యసాచి గోష్, వికాస్ రాజ్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్ మను చౌదరి, అడిషనర్ కలెక్టర్లు కె.కిరణ్మయి, చంద్రారెడ్డి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, డీఆర్వో శారద తదితరులు పాల్గొన్నారు.
