
ఈ భూమిపై జీవించింది కేవలం ముప్ఫై రెండేళ్లు. అందులో నటిగా కొనసాగిన సంవత్సరాలు పన్నెండు. కానీ సౌత్ సినిమాపై ఆమె వేసిన ముద్ర ఆయువు కొన్ని యుగాలు. ఓ నటి టాప్ హీరోయిన్ అవ్వాలంటే గ్లామరస్గా కనిపించాల్సిన అవసరం లేదని ప్రూవ్ చేయడమే కాదు.. నటన అంటే కేవలం నటించడం కాదని, ఆ పాత్రగా మారిపోవడమని చెప్పిన ఆమె ఎవరో కాదు.. సావిత్రి ఆఫ్ మోడర్న్ డేస్గా కీర్తి గడించిన.. సౌందర్య. ఇవాళ ఆమె 50 వ జయంతి సందర్భంగా ద గ్రేట్ యాక్ట్రెస్ సౌందర్యకి ప్రత్యేక నివాళి.
సౌందర్య అసలు పేరు సౌమ్య. బెంగళూరులో పుట్టింది. తండ్రి కన్నడ నిర్మాత, రచయిత. మొదట డాక్టర్ అవ్వాలనుకుంది సౌందర్య. ఎంబీబీఎస్లో చేరింది కూడా. అయితే తనను హీరోయిన్ని చేయాలనేది ఆమె తండ్రి కల. ఆయన కోరిక మేరకు తన లక్ష్యాన్ని పక్కన పెట్టేసింది సౌందర్య. చదువు మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి వచ్చేసింది.
1992లో ‘గంధర్వ’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది సౌందర్య. ఆ తర్వాతి సంవత్సరమే ‘రైతుభారతం’లో యాక్ట్ చేసింది. కానీ ఏవో కారణాల వల్ల ఆ సినిమా లేట్ కావడంతో ‘మనవరాలి పెళ్లి’ మూవీ మొదట రిలీజయ్యింది. దాంతో తెలుగులో ఆమె మొదటి చిత్రం అదే అయ్యింది. పన్నెండేళ్ల కెరీర్లో వందకు పైనే సినిమాలు చేసింది. తెలుగులో రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, హలో బ్రదర్, నంబర్ ఒన్, పెదరాయుడు లాంటి హిట్స్ చాలానే ఉన్నాయి. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం లాంటి సినిమాలు పెద్ద విజయం సాధించడంతో వెంకటేష్, సౌందర్యలది హిట్ పెయిర్గా నిలిచింది.
కెరీర్ స్టార్టింగ్లో మాతృభాష కన్నడలోనే ఎక్కువ నటించిన సౌందర్య, ఆ తర్వాతి కాలంలో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోవడంతో కన్నడలో సినిమాలు చేయడం మానేసింది. అయితే రవిచంద్రన్ పట్టుబట్టి తనని మళ్లీ శాండిల్వుడ్కి తీసుకెళ్లారు. ఇద్దరూ కలిసి నటించిన ‘సిపాయి’ మూవీ బ్లాక్బస్టర్ కావడంతో మళ్లీ కన్నడలో బిజీ అయ్యింది సౌందర్య.
ఎక్కువగా తెలుగు, కన్నడ భాషల్లోనే నటించినా.. ఇతర భాషల్లోనూ కొన్ని చిత్రాలు చేసింది సౌందర్య. ‘సూర్యవంశం’ సినిమాని హిందీలో రీమేక్ చేసినప్పుడు తెలుగులో మీనా చేసిన పాత్రకి సౌందర్యను తీసుకున్నారు. అందులో అమితాబ్ బచ్చన్కి జంటగా నటించిందామె. అలాగే తమిళంలో రజినీకాంత్తో అరుణాచలం, నరసింహ చిత్రాల్లో యాక్ట్ చేసింది. కమల్ హాసన్తోనూ ఓ మూవీలో నటించింది. కార్తీక్, అర్జున్, విజయ్కాంత్ లాంటి హీరోలతో కూడా జోడీ కట్టింది. ఇక మలయాళంలో మోహన్లాల్తో ఒక సినిమా, జయరామ్తో ఒక సినిమా చేసింది.
1999లో ఇటు తెలుగులో చిరంజీవితో, అటు తమిళంలో రజినీకాంత్తో, మరోవైపు హిందీలో అమితాబ్తో సినిమాలు చేసింది సౌందర్య. ఒకేసారి ముగ్గురు సూపర్ స్టార్స్ తో వర్క్ చేస్తూ ఉండటంతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో చాలా బిజీగా ఉండేది. ఆ ఏడు ఒకే ఒక్కరోజు మాత్రం ఫ్లైట్ మిస్సవడంతో ‘నరసింహ’ మూవీ షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందట.
1995 నుంచి 2005 వరకు ప్రతి సంవత్సరం సౌందర్య పేరు ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యింది. వాటిలో ఆరుసార్లు ఆమె అవార్డ్ గెల్చుకుంది. పవిత్రబంధం, అమ్మోరు చిత్రాలకు నంది అవార్డులు వరించాయి. రెండుసార్లు కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ తీసుకుంది. ‘ద్వీప’ చిత్రానికి నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది.
టెలివిజన్ రంగంలోనూ సౌందర్య అడుగుపెట్టింది. ‘కొళంగల్’ అనే తమిళ సీరియల్లో ఫిమేల్ లీడ్గా యాక్ట్ చేయడానికి ఒప్పుకుంది. అయితే అప్పటికే భారతీయ జనతా పార్టీ తరఫున ఎలక్షన్ లో ప్రచారం చేస్తానని రెండు నెలల కాంట్రాక్ట్ సైన్ చేసింది. దాంతో కాల్షీట్స్ ఇవ్వలేక ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో దేవయానిని తీసుకున్నారు. ఈ సీరియల్ ‘ముత్యాల ముగ్గు’ పేరుతో తెలుగలోనూ టెలికాస్ట్ అయ్యింది.
సౌందర్యకి లతా మంగేష్కర్ అంటే చాలా ఇష్టం. ఆవిడ పాడిన ‘కభీ కభీ మేరే దిల్మే ఖయాల్ ఆతా హై’ సాంగ్ ఆమె ఫేవరేట్. అందుకే సెట్లో ఆమెతో కలిసి ఎప్పుడు ఉన్నా తాను ఆ పాట హమ్ చేసేవాడినని ఓసారి రాళ్లపల్లి చెప్పారు.
బీజేపీ తరపున ప్రచారం చేయడానికి 2004 ఏప్రిల్ 17న కరీంనగర్ నుంచి బెంగళూరుకు తన అన్నతో కలిసి హెలికాప్టర్లో బయలుదేరారు సౌందర్య. గాంధీకృషి విజ్ఞాన కేంద్రం క్యాంపస్ దగ్గరికి చేకునేసరికి హెలికాప్టర్ కూలిపోయింది. వంద మీటర్ల ఎత్తు నుంచి కిందపడటంతో మంటలు చెలరేగాయి. సౌందర్యతో పాటు ఆమె అన్న కూడా ఆ మంటల్లో కాలిపోయి మరణించారు. అప్పటి నుంచి కర్ణాటకాంధ్ర లలిత కళా అకాడెమీ వారు యేటా ఉగాది పండక్కి సౌందర్య స్మారక పురస్కారం పేరుతో ఉత్తమ నటీమణులకు అవార్డు ఇస్తున్నారు.
గ్లామర్కి దూరంగా ఉంటూనే స్టార్ హీరోయిన్ అయిన ఘనత సౌందర్యది. ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నటిగా తనను ఉన్నత స్థాయికి చేర్చే సినిమాలు చేసింది. అమ్మోరు, తొమ్మిది నెలలు, అంత:పురం లాంటి చిత్రాలు ఆమె ప్రతిభకు ఆనవాళ్లు. ఆమె కెరీర్లో మైలురాళ్లు. ఇక కన్నడలో చేసిన ద్వీప, ఆప్తమిత్ర చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ద్వీప చిత్రం ఆమెకి ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టింది. ‘ఆప్తమిత్ర’ మూవీ మలయాళ హిట్ ‘మణిచిత్రతాజు’ ఆధారంగా రూపొందింది. ‘చంద్రముఖి’కి కూడా ఇదే ఆధారం. కన్నడలో సౌందర్య నటించిన చివరి చిత్రం ‘ఆప్తమిత్ర’నే. తెలుగులో మోహన్బాబుతో నటించిన ‘శివశంకర్’ లాస్ట్ సినిమా. ఈ రెండూ కూడా ఆమె చనిపోయాక రిలీజయ్యాయి.
తాను హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ‘నర్తనశాల’ సినిమాని మొదలుపెట్టారు బాలకృష్ణ. ఇందులో సౌందర్యను ద్రౌపదిగా తీసుకున్నారు. కొన్నాళ్లు వర్క్ చేశాక ఈ సినిమా కొన్ని సమస్యలతో ఆగిపోయింది. తర్వాత పూర్తి చేద్దామనుకున్నారు బాలయ్య. కానీ సౌందర్య చనిపోవడంతో ఆమెని రీప్లేస్ చేసే నటి దొరకలేదని బాలయ్య ఓ సందర్భంలో అన్నారు. అయితే అంతవరకు తీసిన ఫుటేజ్తో ఓ ట్రైలర్ను కట్ చేసి ఆమధ్య విడుదల చేశారు. ఇందులో సౌందర్యను చూసి ఆమె అభిమానులు ఎంతో సంతోషపడ్డారు.
షూటింగ్ కోసం ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ప్రశాంత్ కుటీర్లోని రూమ్ నంబర్ టెన్లో స్టే చేసేది సౌందర్య. తను స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలగడంతో దీనికి లక్కీ రూమ్గా పేరు వచ్చింది. అప్కమింగ్ హీరోయిన్స్ అందులో ఉండటానికి ఆసక్తి చూపించేవారు. సెంటిమెంటుగా ఫీలయ్యేవారు. అందుకే ఆమె చనిపోయాక ఆ గదికి సౌందర్యాస్ రూమ్ అని పేరు పెట్టారు.
సౌందర్య ఎంతో మంచి వ్యక్తి. తనని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారనే కృతజ్ఞతతో త్రిపురనేని చిట్టిబాబు తీసిన ‘గెలుపు’ మూవీలో ఓ గెస్ట్ రోల్ చేసిందామె. స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిందట. ఒక సోషల్ సర్వీస్లోనూ ముందుండేది. అనాథ పిల్లల కోసం తన తండ్రి పేరుమీద బెంగళూరులో మూడు స్కూల్స్ ఓపెన్ చేసింది. కర్ణాటకలో ఓ ఊరిని దత్తత తీసుకుని పూర్తిగా డెవెలప్ చేసింది. ఇంకా అన్నయ్యతో కలిసి చాలా సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఆమె మరణించాక ఆ సేవల్ని తల్లి మంజుల కొనసాగించారు. అమర్ సౌందర్య విద్యాలయాస్ పేరుతో మరికొన్ని స్కూళ్లు తెరిచిందామె.
ఇంత గొప్ప నటి, వ్యక్తి కనుకనే చనిపోయి ఇన్నేళ్లయినా సౌందర్యని ఎవ్వరూ మర్చిపోలేకపోయారు. ఆమెపై బయోపిక్ తీయాలని కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు. సినిమాలు తీసినా తీయకపోయినా.. తనపై పుస్తకాలు రాసినా రాయకపోయినా.. మరుగునపడిపోయే కీర్తి కాదామెది. మనసును వీడిపోయే జ్ఞాపకాలు కావు ఆమెవి. ఇప్పటికీ ఎప్పటికీ సౌందర్య తెలుగువారికి అభిమాన నటే. ఆమె స్థానం ఆమెది మాత్రమే.