బెంగళూరులో విషాద ఘటన.. రెప్పపాటులో ప్రాణం పోయింది.. రాజారాణి సినిమాలో జరిగినట్టుగానే..!

బెంగళూరులో విషాద ఘటన.. రెప్పపాటులో ప్రాణం పోయింది.. రాజారాణి సినిమాలో జరిగినట్టుగానే..!

బెంగళూరులో విషాద ఘటన జరిగింది. HDFC బ్యాంకులో జాబ్ చేస్తున్న యోగేశ్వరి అనే 27 ఏళ్ల యువతి మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బెంగళూరు రాజాజీనగర్ డాక్టర్.రాజ్ కుమార్ రోడ్ లో రోడ్డు క్రాస్ చేస్తుండగా మితిమీరిన వేగంతో వెళుతున్న ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ ఆమెను ఢీ కొట్టింది. ఈ ఘటనలో యోగేశ్వరిని బుల్లెట్ బైక్ కొంత దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలపాలై రక్తం పోవడంతో ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంటర్నల్గా హెవీ బ్లీడింగ్ కారణంగా ఆమె ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే లోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బుల్లెట్ బండి నడుపుతున్న దీపక్ అనే 22 ఏళ్ల కుర్రాడు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మితి మీరిన వేగం ఒకరి ప్రాణం తీసింది. మరొకరిని ఆసుపత్రి పాలు చేసింది. యోగేశ్వరి పనిచేస్తున్న HDFC బ్యాంకు ఎదురే ఈ ఘటన జరిగింది. సహోద్యోగినితో కలిసి బయటకు వెళ్లి లంచ్ చేసి వస్తూ రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ ఘోరం జరిగిపోయింది. ఆమె వెనకే ఉన్న యోగేశ్వరి సహోద్యోగిని షాక్కు గురైంది. కొంతసేపటికి తేరుకుని యోగేశ్వరి దగ్గరకు వెళ్లింది.

బుల్లెట్ బైక్ వస్తున్న విషయాన్ని యోగేశ్వరి గమనించింది. కానీ.. స్పీడ్ను తప్పుగా అంచనా వేసి ఆ బైక్ వచ్చే లోపు రోడ్డు దాటేయొచ్చని ఆమె భావించింది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. బెంగళూరు రాజాజీనగర్ ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు దాటే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని.. కొన్ని కొన్ని సందర్భాల్లో మన తప్పు లేకపోయినా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.