
ఆషాఢ మాస బోనాలకు పట్నం సిద్ధమవుతోంది. గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి జూన్ 26న ప్రారంభమయ్యే ఉత్సవాలతో సిటీలో బోనాల సందడిగా మొదలు కానుంది. ఈ నేపథ్యంలో పలు ప్రముఖ ఆలయాల్లో జరిగే ముఖ్య ఘట్టాలపై ఆయా ప్రతినిధులు ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు.
గోల్కొండ బంగారు బోనానికి అభిషేకం
మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలిసారిగా బొమ్మల కుటుంబసభ్యులు బంగారు బోనం తయారు చేయించారు. ఆదివారం రిసాల బజార్లో తమ ఇంట్లో అమ్మవారి ఉత్సవమూర్తులతోపాటు బంగారు బోనానికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ నెల 26న రిసాల బజార్ నుంచి సుమారు 100 మంది పోతరాజులు, శిససత్తులు కళాకారులతో అమ్మవారికి తొలి బోనం బయలుదేరుతుందని నిర్వాహకులు శ్రీకాంత్ చారి తెలిపారు. ఈసారి అమ్మవారికి బంగారు బోనంతోపాటు తాళిబొట్టును సమర్పించనున్నట్లు చెప్పారు. తమ పూర్వీకుల నుంచి అమ్మవారికి పూజలు చేస్తున్నామన్నారు. శివ చారి, సురేవ్ చారి, పద్మాచారి, వాణిశ్రీ, మల్లేశ్ చారి తదితరులు పూజల్లో పాల్గొన్నారు.
జులై 11 నుంచి లాల్ దర్వాజ్ బోనాలు
బషీర్బాగ్, పాతబస్తీ లాల్ దర్వాజ్ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు జులై 11నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహవాహిని మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ మారుతీ యాదవ్, కన్వీనర్ అరవింద్ గౌడ్ తెలిపారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు.
జులై 11న గణపతి హోమంతో అమ్మవారి ఘటం ఊరేగింపు ఉంటుందన్నారు. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజాలు నిర్వహించినట్లు తెలిపారు. జులై 20న అమ్మవారి బోనాలు, 21న పోతరాజు, రంగం, అమ్మవారి ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా దేశ రాజధాని దిల్లీలోని తెలంగాణ భవన్ లో జులై 1, 2న బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జులై 2న బల్కంపేట ఎల్లమ్మకు బంగారు బోనం
హైదరాబాద్ సిటీ/పద్మారావునగర్ : బల్కంపేట ఎల్లమ్మకు జులై 2న పాతబస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పిస్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సుమారు 500 మంది వివిధ దేవాలయాలకు చెందిన కమిటీ ప్రతినిధులు అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి కల్యాణం సందర్భంగా సమర్పించనున్న పోచంపల్లి పట్టువస్త్రాలను పద్మశాలీ సంఘం జయరాజ్ ఆధ్వర్యంలో మగ్గంపై తయారు చేసే పనులను ప్రారంభించారు. తలసాని మాట్లాడుతూ అమ్మవారి కల్యాణంలో పాల్గొనే దంపతులకు ఇచ్చే టికెట్లను తగ్గిస్తున్నారని, దాతలకు ఇచ్చే పాస్ లను తగ్గిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు.
కొత్త విధానాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్మ దాతలను అవమానించడం కరెక్ట్కాదన్నారు. మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈఓ మహేందర్ గౌడ్ పాల్గొన్నారు.