దుబాయ్ విమానాల ఆలస్యం: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ ప్రయాణికుల నిరసన!

దుబాయ్ విమానాల ఆలస్యం: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ ప్రయాణికుల నిరసన!

ఢిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానాలు SG 5111, SG 5105 ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం ఉదయం, సాయంత్రం బయలుదేరాల్సిన ఈ విమానాలు టెక్నికల్ అండ్ మెయింటెనెన్స్ కారణాల వల్ల పదే పదే వాయిదా పడ్డాయి. ఒక విమానం గ్రౌండ్ కావడమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని ఎయిర్‌లైన్స్ వర్గాలు అంటున్నాయి.

దీంతో దాదాపు 200 మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-3 వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమాన షెడ్యూల్‌పై స్పష్టత లేకపోవడంతో ఎయిర్‌పోర్టులో నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి.

పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని స్పైస్‌జెట్ ప్రతినిధి వెల్లడించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రానికి ఈ విమానాలు బయలుదేరేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ధృవీకరించాయి.

ALSO READ : సేమ్ ఫుడ్ సేమ్ హోటల్.. స్విగ్గీలో ఆర్డర్ చేస్తే రూ.206 ఎక్కువ

SG 5111 విమానం మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు బోర్డింగ్ పూర్తి చేసుకుని బయలుదేరడానికి సిద్ధమైంది. అలాగే రెండవ విమానమైన SG 5105 సాయంత్రం 4 గంటలకు ఐజీఐ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు బయలుదేరనుంది. దీంతో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.