హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ దగ్గర పెను ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో వెళ్తున్న RTC బస్సుపై చెట్టు పడిపోవడంతో ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా భారీ వృక్షం బస్సుతో పాటు ఆటోలపై కూలిపోయింది. 2026 సెప్టెంబర్ 15న జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులతో పాటు ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బాగా తడిసిన చెట్టు కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అకస్మాత్తుగా చెట్టు బస్సుపైన పడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఎవరికీ ప్రమాదం జరగక పోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
చెట్టు పడిపోవటంతో చెట్టు కింద ఉన్న మూడు ఆటోలు, రెండు బైక్ లు డ్యామేజ్ అయ్యాయి. చిరువ్యాపారుల స్టాల్స్ ధ్వంసం అయ్యాయి. అకస్మాత్తుగా చెట్టు విరిగిపడడం తో అక్కడున్న వారంతా ప్రాణం భయంతో పరుగులు పెట్టారు.
బస్సు మూలమలుపు తిరిగే సమయంలో విద్యుత్ వైర్లు చుట్టుకోవడంతో చెట్టు విరిపడినట్లు చెబుతున్నారు. చెట్టును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు.
