వెండితెర తారల వినోదాల విందు, సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ అవార్డ్స్ ఫెస్టివల్ 'సీమా (SIIMA) 2026' 14వ ఎడిషన్ వేడుక బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరింది. అయితే సెప్టెంబర్ 12, 13 తేదీల్లో వైభవంగా జరిగిన ఈ అవార్డుల పండుగలో ఊహించని డ్రామా చోటుచేసుకుంది. టాలీవుడ్ భల్లాలదేవుడు రానా దగ్గుబాటి సృష్టించిన ఓ హంగామా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కన్నడ ఫేమస్ యాంకర్ అకుల్ బాలాజీ వేదికపై 'మిరాయ్ 2' చిత్రబృందాన్ని పదే పదే ప్రశ్నిస్తూ... 'ఈ సీక్వెల్లో రానా ఉంటాడా? లేదా?' అంటూ బాహాటంగానే ఆరా తీశాడు. అకుల్ తుంటరి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కన్నా, తన మార్క్ స్వాగ్తో షాక్ ఇవ్వడమే నయమనుకున్నాడేమో... రానా వేదికపై నుంచే నేరుగా వాటర్ బాటిల్ తీసి అకుల్ మీదికి విసిరేశాడు.. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా స్టేజిపై ఉన్నవారంతా బిత్తరపోగా.. ఆ వెంటనే హాల్మొత్తం నవ్వులతో మారుమోగిపోయింది.
ఈ చిన్న క్లిప్పింగ్ నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం... నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. గతంలో ఆస్కార్ వేదికపై విల్ స్మిత్ కొట్టిన చెంపదెబ్బ సంఘటనను గుర్తుచేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఇది కేవలం వీరిద్దరి మధ్య ఉన్న క్లోజ్ ఫ్రెండ్షిప్ వల్ల సరదాగా జరిగిన ఘటనే తప్ప ఎలాంటి వివాదం లేదని స్పష్టమైంది.
ALSO READ : బిగ్బాస్ వేదికగా పొలిటికల్ రగడ..
ఒకవైపు ఈ సరదా రగడ వైరల్ అవుతుంటే, మరోవైపు రానా లైనప్ పిచ్చ క్రేజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ విజువల్ వండర్ 'విశ్వంభర'లో పవర్ ఫుల్ విలన్గా రానా రచ్చ చేయబోతున్నాడు. అలాగే దుల్కర్ సల్మాన్తో కలిసి 'కాంత' వంటి ప్రతిష్టాత్మక చిత్రంలోనూ భాగమయ్యాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినీ పరిశ్రమకు చెందిన తారలందరూ ఒకేచోట చేరిన ఈ సైమా వేడుకల్లో.. అవార్డుల విందు ఒకెత్తయితే... రానా బాటిల్ విసిరిన ఈ రచ్చ మ్యాటర్ మాత్రం సోషల్ మీడియాలో అసలైన ట్రెండింగ్ టాపిక్గా నిలిచింది.
