- జింఖానా గ్రౌండ్లో ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
సికింద్రాబాద్, వెలుగు: క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్–2023 పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో సీఎం కప్ పోటీలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామని, వీటిని సద్వినియోగం చేసుకుని స్థానిక స్టూడెంట్లు, యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, క్రిశాంక్, గజ్జెల నగేశ్ పాల్గొన్నారు.
ఆకలితో అలమటించిన క్రీడాకారులు
ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలను సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఎల్ బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలెక్టర్ హరీశ్తో కలిసి ప్రారంభించారు. అయితే క్రీడాకారులకు మధ్యాహ్న భోజనం కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. సాధారణంగా ఎలాంటి క్రీడలు ఏర్పాటు చేసినా క్రీడాకారులకు పోషకాహార భోజనం అందజేస్తారు. కానీ ప్రభుత్వం సీఎం కప్ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను మధ్యాహ్నం సరిగా ఫుడ్ పెట్టలేదు. కొంతమందికే అందజేసి మిగతావారిని వెనక్కి పంపించేశారు. ఉదయం 6 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరామని, ఇక్కడ లంచ్ పెట్టలేదని చాలా మంది క్రీడాకారులు ఆరోపించారు. ఖాళీ కడుపుతో గేమ్ ఎలా ఆడాలని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి మాత్రమే ఓ అన్నం పాకెట్, కొంచెం మజ్జిగ ఇచ్చి పంపించినట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయని తెలిస్తే తమ పిల్లలను తీసుకువచ్చేవాళ్లం కాదని క్రీడాకారుల తల్లిదండ్రులు వాపోయారు.