బడంగ్పేట, వెలుగు: మహేశ్వరం సెగ్మెంట్లో డ్రగ్స్ మాఫియా, బెల్ట్ షాపులతో యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారిపోయారని బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సరూర్ నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్, అంబేద్కర్ నగర్లో పాదయాత్ర చేశారు. ఆయా కాలనీల్లో శ్రీరాములుకు మంగళహారతులిచ్చి మహిళలు స్వాగతం పలికారు. పాదయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను తీర్చడంలో మంత్రి సబిత విఫలమయ్యారని విమర్శించారు. సెగ్మెంట్లో బెల్ట్ షాపులు, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరకడమే కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా పెరిగిపోయానని మండిపడ్డారు.
గతంలో బీజేపీ ఎమ్మెల్యే హయాంలో జరిగిన అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ తప్ప, మంత్రి సబితమ్మ పాలనలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే డబుల్ ఇండ్లు , రేషన్ కార్డులు, పెన్షన్లు, ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్, అధ్యక్షుడు సిద్దూ ముదిరాజ్, బీజేపీ నేతలు బాణాల ప్రవీణ్, ఆరుట్ల సురేశ్, నాగరాజు, కట్టెల శివ పాల్గొన్నారు.