రైస్ ​మిల్లర్​ను బెదిరించిన.. ఐదుగురు ఫేక్​ జర్నలిస్టులు

రైస్ ​మిల్లర్​ను బెదిరించిన.. ఐదుగురు ఫేక్​ జర్నలిస్టులు

మెదక్ (చేగుంట), వెలుగు: రైస్ మిల్లర్​ను బెదిరించి అక్రమంగా వసూళ్లకు యత్నించిన ఐదుగురు ఫేక్​జర్నలిస్టులను అరెస్ట్​చేసినట్లు నార్సింగి ఎస్సై అమ్మద్ మొహినొద్దీన్ తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన దాసరి నాగరాజు, కుక్కల రాజు, మండ్ల రాజమౌళి, వడ్ల రాజేందర్, మాడిపల్లి కిరణ్ కుమార్ మంగళవారం రెండు కార్లలో మెదక్ జిల్లా నార్సింగికి వచ్చారు. వడ్ల లోడుతో రామాయంపేట నుంచి నార్సింగిలోని గోదాంకు వస్తున్న లారీని ఆపారు. డ్రైవర్ ను బెదిరించారు. వెంటనే డ్రైవర్ రైస్ మిల్ యజమాని శ్రావణ్​కుమార్ కు సమాచారం ఇవ్వటంతో ఆయన అక్కడికి వచ్చాడు. తాము జర్నలిస్టులమని, డబ్బు ఇవ్వాలని ఐదుగురు డిమాండ్​చేశారు..

ఇవ్వకపోతే అక్రమ కేసులు పెట్టిస్తామని బెదిరించారు. వారి తీరుపై అనుమానం వచ్చి, శ్రావణ్​వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి ఐదుగురు ఫేక్​జర్నలిస్టులని తేల్చారు. ఒక్కొక్కరి దగ్గర నాలుగు చొప్పున ఫేక్​ఐడెంటిటీ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని రెండు కార్లు, ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ లో వీరిపై కామారెడ్డి జిల్లా భిక్కనూర్ లో కేసు నమోదైనట్లు గుర్తించారు.