స్టాఫ్​ నర్స్ ఫలితాలు రిలీజ్ ..  అర్హులు లేక 138 పోస్టులు ఖాళీ

స్టాఫ్​ నర్స్ ఫలితాలు రిలీజ్ ..  అర్హులు లేక 138 పోస్టులు ఖాళీ

హైదరాబాద్​, వెలుగు: స్టాఫ్​ నర్స్​ ఎగ్జామ్ పరీక్షల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మెడికల్​ అండ్​ హెల్త్​ సర్వీసెస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు ఆదివారం ఫైనల్​ మెరిట్​ లిస్టును రిలీజ్​ చేసింది. 7,094 పోస్టులకుగానూ 6,956 మందిని ఎంపిక చేసినట్టు వెల్లడించింది. వివిధ కేటగిరీల్లో అర్హులు లేకపోవడంతో 138 పోస్టులు మిగిలిపోయాయని పేర్కొంది. జోన్లవారీగా రిజర్వేషన్​ కటాఫ్​లనూ ఫలితాల్లో పేర్కొంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్​ రెడ్డి చేతులమీదుగా అపాయింట్​మెంట్​ ఆర్డర్లను అందించనున్నారు.

ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ హాజరుకానున్నారు. పోయినేడాది డిసెంబర్​ 30న 5,204 స్టాఫ్​నర్సు పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆగస్టు 2న పరీక్ష నిర్వహించగా 38,674 మంది హాజరయ్యారు. ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబరు 15న నోటిఫికేషన్​లో మరో 1,890 పోస్టులను కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగింది. వీటిలో డీఎంఈ పరిధిలో 5,650 పోస్టులు, టీవీవీపీలో 757, ఎంఎన్ జే, గురుకులాల్లో మిగతా పోస్టులున్నాయి.