
హైదరాబాద్, వెలుగు: స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ పరీక్షల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ఫైనల్ మెరిట్ లిస్టును రిలీజ్ చేసింది. 7,094 పోస్టులకుగానూ 6,956 మందిని ఎంపిక చేసినట్టు వెల్లడించింది. వివిధ కేటగిరీల్లో అర్హులు లేకపోవడంతో 138 పోస్టులు మిగిలిపోయాయని పేర్కొంది. జోన్లవారీగా రిజర్వేషన్ కటాఫ్లనూ ఫలితాల్లో పేర్కొంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లను అందించనున్నారు.
ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ హాజరుకానున్నారు. పోయినేడాది డిసెంబర్ 30న 5,204 స్టాఫ్నర్సు పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆగస్టు 2న పరీక్ష నిర్వహించగా 38,674 మంది హాజరయ్యారు. ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబరు 15న నోటిఫికేషన్లో మరో 1,890 పోస్టులను కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగింది. వీటిలో డీఎంఈ పరిధిలో 5,650 పోస్టులు, టీవీవీపీలో 757, ఎంఎన్ జే, గురుకులాల్లో మిగతా పోస్టులున్నాయి.