
కార్తి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్లో ‘జాను’ ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘సత్యం సుందరం’ (Satyam Sundaram). సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబర్ 28న సినిమా విడుదలవుతున్న సందర్భంగా కార్తి ఇలా ముచ్చటించారు.
‘‘ప్రేమ్ దగ్గర నా కోసం ఓ కథ ఉందని తెలిసి మెసేజ్ చేశాను. లాక్డౌన్లో తను రాసిన ఓ నవల ఇచ్చి చదవమన్నారు. అదొక ఫీల్ గుడ్ నవల. చదువుతుంటే కొన్ని చోట్ల కన్నీళ్లు వచ్చాయి. నాకు కె.విశ్వనాధ్ గారి సినిమాలు ఇష్టం. ఇది చదివినప్పుడు అలాంటి ఓ మంచి సినిమా అవుతుంది అనిపించింది. మనలోని చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అరుదైన కథ. కచ్చితంగా సినిమా చేయాలి అనిపించింది.
అన్నయ్య (సూర్య)కు చెబితే ఇలాంటి కథలు నీ దగ్గరకే ఎలా వస్తున్నాయి అని అంటూ, తానే ప్రొడ్యూస్ చేస్తానన్నారు. అన్నదమ్ములు లాంటి ఇద్దరి మధ్య జరిగే కథ. ఆ పాత్రకు అరవింద్ స్వామి గారు తప్ప మరో చాయిస్ కనిపించలేదు. ఆయన కథ చదివి చాలా ఎమోషనల్ అయ్యారు. మనకు అన్ కండిషనల్ లవ్ అనేది ఫ్యామిలీ నుంచి మాత్రమే దక్కుతుంది.
అలాంటి ప్రేమను చూపించే సినిమా ఇది. మన సంస్కృతి, మూలాలతో పాటు చక్కని హ్యూమర్ ఉన్న ఎమోషనల్ స్టోరీ కూడా. చాలాచోట్ల ఆనందంతో కన్నీళ్లు వస్తాయి. ఇందులోని ప్రతి పాట మీనింగ్ ఫుల్గా ఉంటుంది. నేపథ్య సంగీతం హంటింగ్గా ఉంటుంది. ప్రేమ్ అద్భుతమైన మాటలు రాశారు. నేచురాలిటీ కోసం సింక్ సౌండ్ వాడాం కెమెరా మూమెంట్స్ కూడా ఆర్గానిక్గా ఉంటాయి.
నిజ జీవితాన్ని తెరపై చూసిన ఫీల్ కలుగుతుంది. ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా చూస్తే ఇంకా ఆస్వాదిస్తారు. ‘96’ తరహాలోనే ఒక రాత్రిలో జరిగే కథ. ప్రేక్షకులకు ‘సాగర సంగమం’ తరహా అనుభూతిని పంచుతుంది. నా ఫస్ట్ మూవీ చూసి నన్ను హగ్ చేసుకున్న అన్నయ్య.. మళ్లీ ఈ సినిమా చూసి ప్రౌడ్గా హగ్ చేసుకున్నారు.
ఏషియన్, సురేష్ ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ‘సర్దార్ 2’ షూటింగ్ జరుగుతోంది. అలాగే ‘వా వాతియారే’ కూడా ఉంది. ‘ఖైదీ 2’ వచ్చే ఏడాది ఉండొచ్చు’’.