
కేంద్ర బిల్లులకు వ్యతిరేకంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఉద్యమం చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ వాళ్ళు పరాయి లీడర్లు, పక్క జిల్లాల నుండి మనుషులను తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఉండగా తిన్నది అరగక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని బీజేపీ వాళ్ళు అన్నారన్నారు. వ్యవసాయం దండగని కేంద్ర మంత్రి గా ఉన్నప్పుడు బండారు దత్తాత్రేయ అన్నారని తెలిపారు. కాలిపోయే మోటార్లు కావాలా, బావి దగ్గర మీటర్లు కావాలా, 24 గంటలు కరెంట్ కావాలా ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు మంత్రి హరీష్.
27ఏప్రిల్ 2020 న కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లు తెచ్చిందని..17 మే సబ్సిడీ లేకుండా బిల్లు ఇవ్వాలి అని కేంద్రం రాష్ట్రానికి లెటర్ రాసిందని తెలిపారు హరీష్. అంతేకాదు..బావి ల దగ్గర మీటర్లు పెడితే 2500 కోట్లు ఇస్తామన్నారని చెప్పారు. అయితే జూన్ 2 వ తేదీన మీటర్లు పెట్టబోమంటూ సీఎం కేసీఆర్ ..కేంద్రానికి లెటర్ రాశారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం లో పంట ఎండకుండా ఎప్పుడు అయిన పండిందా అని ప్రశ్నించారు మంత్రి హరీష్. ముత్యం రెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు 30 వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ లు ఇచ్చేవారని ఆరోపించారు. విదేశీ మక్కలు తెస్తే ఇక్కడి మక్కలు ఎవరు కొంటారన్నారు. ఎవరి ప్రయోజనాలు కోసం బీజేపీ పని చేస్తోందని ప్రశ్నించారు. అబద్దాల పునాదుల మీద బీజేపీ , కాంగ్రెస్ నాయకులు ఓట్లు పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ .