ముంబై: రాబోయే పండుగ సీజన్లో దేశీయంగా తాత్కాలిక, గిగ్ ఉద్యోగాలు కిందటేడాదితో పోలిస్తే 15-–20 శాతం పెరుగుతాయని హెచ్ఆర్ సంస్థ అడెక్కో ఇండియా పేర్కొంది. దాదాపు 2.5 లక్షల నుంచి 2.7 లక్షల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ కంపెనీ రిపోర్ట్ ప్రకారం, ఈ–-కామర్స్, లాజిస్టిక్స్, క్విక్ కామర్స్, ఆర్గనైజ్డ్ రిటైల్, బీఎఫ్ఎస్ఐ రంగాలు ఈ నియామకాల్లో ముందంజలో ఉన్నాయి. గిగ్ వర్కర్ల డిమాండ్లో 45 శాతం లక్నో, భువనేశ్వర్, జైపూర్, కోయంబత్తూర్ వంటి నగరాల నుంచే వస్తోంది. జీతాలు పెరుగుతాయని ఈ రిపోర్ట్ పేర్కొంది.
మెట్రో నగరాల్లో తాత్కాలిక ఉద్యోగుల వేతనాలు 12-–15 శాతం, చిన్న నగరాల్లో 8-–10 శాతం వరకు పెరగొచ్చని, హిందీ, ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ మాట్లాడగలిగే వారికి ప్రాధాన్యత పెరిగిందని వివరించింది. పండుగ సీజన్ కోసం చేరే వారిలో దాదాపు 25 శాతం మందిశాశ్వత ఉద్యోగులుగా మారే అవకాశముంది.
తగ్గిన నిరుద్యోగం
దేశంలో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతోందని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సర్వే తెలిపింది. ఈ ఏడాది జులైలో ఇది5.1 శాతానికి పడిపోయింది. అంతకుముందు నెలలో 5.5 శాతంగా నమోదైంది. గ్రామాల్లో నిరుద్యోగ రేటు 5 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. పట్టణాల్లో మాత్రం 6.7 శాతంగా ఉంది. 15 ఏళ్లు దాటిన పురుషుల్లో నిరుద్యోగం ఐదు శాతానికి దిగివచ్చింది. దేశవ్యాప్తంగా లేబర్ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 55.4 శాతానికి పెరిగింది. మహిళల వాటా కూడా మునుపటి నెలతో పోలిస్తే మెరుగుపడింది. గ్రామీణ ప్రాంతాలలో మహిళల ఉపాధి రేటు 37.2 శాతానికి చేరింది.
