- 2,99,850 మంది ఆబ్సెంట్
- డ్రాఫ్ట్లో మొత్తం ఓటర్లు 27,95,225
- నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ
- ఈఆర్వో ఆఫీసుల్లో ముసాయిదా ఓటర్ల జాబితా
హైదరాబాద్ సిటీ, వెలుగు : ‘సర్’ లో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్)ను అధికారులు విడుదల చేశారు. వీటిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ఈఆర్వో) ఆఫీసులతో పాటు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. పరిశీలన తర్వాత మొత్తం 27,95,225 మంది ఓటర్లతో ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఇందులో13,86,536 మంది పురుషులు,14,08,513 మంది మహిళలు,176 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. ఎస్ఐఆర్ కు ముందు 47,36,669 ఓటర్లుండగా, 27,95,225 ఫారాలు (59.01 శాతం) డిజిటైజ్ చేశారు.
మ్యాపింగ్కాని వారికి నోటీసులు
మొత్తం 19,41,444 మంది ఓటర్లను ఏఎస్ డీ(ఆబ్సెంట్,షిఫ్టెడ్, డెత్) కేటగిరీలో గుర్తించారు. వీరిలో 13,45,333 మంది ఓటర్లు షిఫ్ట్ కాగా,..2,99,850 మంది ఆబ్సెంట్ గా, 1,56,392 మంది మరణించినట్టుగా గుర్తించారు. ఇక 5,82,217 మంది ఫామ్స్లో గత ఎస్ఐఆర్ తో మ్యాపింగ్ జరగలేదు. వీరి ఫామ్స్లో పలు తప్పులు ఉండడంతో అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. వీరు వయస్సు, పుట్టిన తేదీ ఆధారంగా వివిధ కేటగిరీలకు వేర్వేరు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 1 జూలై 1987కు ముందు పుట్టిన వారు తమకు సంబంధించిన పత్రాలను సమర్పించాలి.
1 జూలై 1987 నుంచి 2 డిసెంబర్ 2004 మధ్య పుట్టిన వారు తమతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరి పత్రాలను, 2 డిసెంబర్ 2004 తర్వాత పుట్టిన వారు తమతో పాటు తల్లిదండ్రులిద్దరి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ను గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణిస్తారని, పుట్టిన తేదీ లేదా నివాస ధ్రువీకరణకు ఆధార్ పత్రంగా పరిగణించరాదని అధికారులు చెబుతున్నారు. అలాగే, ఇప్పటికే రిలీజ్చేసిన డ్రాఫ్ట్లో పేరు చేర్చడం, పేరుపై అభ్యంతరం , ఓటరు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు సెప్టెంబర్16 వరకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలు, క్లెయిమ్ల పరిశీలన మంగళవారం నుంచి అక్టోబర్ 15 వరకు కొనసాగనుండగా, తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు.
ముసాయిదా జాబితాలో కార్వాన్ టాప్...
హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో కార్వాన్లో 2,41,424 మంది ఓటర్లుండగా, తర్వాత బహదూర్పురాలో 2,29,673, చాంద్రాయణగుట్టలో 2,28,431, జూబ్లీహిల్స్లో 2,27,219 , యాకుత్పురాలో 2,19,966, నాంపల్లిలో 2,08,814, మలక్పేటలో 1,82,392, ఖైరతాబాద్లో 1,70,195, ముషీరాబాద్లో 1,70,046, అంబర్పేటలో 1,62,011, చార్మినార్లో 1,43,309 , సనత్నగర్లో 1,39,899, సికింద్రాబాద్లో 1,66,241, గోషామహల్లో 1,65,060, కంటోన్మెంట్లో 1,40,545 మంది ఓటర్లు నమోదయ్యారు.
